VC Sajjanar: ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన తాత్కాలిక అంతరాయంపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనను సైబర్ నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఉందనే వార్తల నేపథ్యంలో తక్షణమే డెలివరీ చేస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వినూత్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు చేశారు. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ కోసం వెతికే వారే లక్ష్యంగా కేటుగాళ్లు వల విసురుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తక్షణమే సిలిండర్ అందజేస్తామంటూ లేదా అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలను నమ్మవద్దని సజ్జనార్ కోరారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ నేరగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని హెచ్చరించారు.
సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం కేవలం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలి. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ (OTP), యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని సజ్జనార్ సూచించారు. నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యక్తిగత ఆర్థిక సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలి. లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండటమే వాటిని నివారించేందుకు ఉన్న ఏకైక మార్గమని ఆయన గుర్తు చేశారు. గ్యాస్ సంక్షోభం సమయంలో భయాందోళనలకు గురై సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు
Read Also: Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా