BRICS 2026 Logo: బ్రిక్స్ 2026 అధికారిక లోగో, వెబ్సైట్ను విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం విడుదల చేశారు. బిక్స్ సమ్మి్ట్ కు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తుంది. ప్రపంచంనిలో ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్ గా ఏర్పడ్డాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేషియా.. ఈ ఫోరమ్లో పూర్తి సభ్యులుగా చేరాయి. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భాగస్వామ్యం, కమ్యూనికేషన్, సహకారాన్ని బలోపేతానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా బ్రిక్స్ లోగోను రూపొందించారు.
బ్రిక్స్ కొత్త లోగో కమలం నుండి ప్రేరణగా రూపొందించారు. కమలం పువ్వు రేకులు బ్రిక్స్ దేశాల రంగులను ప్రతిబింబిస్తున్నాయి. ఒకే భాగస్వామ్యం కింద ఐక్యమైన సభ్య దేశాలను సూచిస్తున్నాయి. ఈ లోగో మధ్యలో నమస్తే అనే గుర్తు ఉంది. ఇది గౌరవాన్ని, సహకారం కోసం పిలుపుగా చెబుతున్నారు. లోగోతో పాటు “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం” అనే ట్యాగ్లైన్ ను విడుదల చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యం, ప్రాజెక్టులు, ఈవెంట్లు, అధికారిక సమాచారం కోసం బ్రిక్స్ అధికారిక వెబ్ సైట్ ను చూడొచ్చని అధికారులు తెలిపారు.
2026లో 20వ బ్రిక్స్ సదస్సు ఛైర్మన్గా భారత్.. ప్రపంచ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించిందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఏర్పడిందే బ్రిక్స్. ఈ గ్రూప్ ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో దాదాపు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతం కలిగి పదకొండు సభ్య దేశాలను ఒకచోట చేర్చింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా వ్యక్తిగతంగా, సమిష్టిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అధిక వాటాను ఆక్రమించాయి.
గోల్డ్మన్ సాచ్స్ 2001లో తన గ్లోబల్ ఎకనామిక్స్ పేపర్ “ది వరల్డ్ నీడ్స్ బెటర్ ఎకనామిక్ బ్రిక్స్”లో బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా వాడింది. 2006లో సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన G8 ఔట్రీచ్ సమ్మిట్ సందర్భంగా రష్యా, భారత్, చైనా అధినేతల సమావేశం తర్వాత ఈ గ్రూప్ అధికారికంగా ఏర్పడింది. ఆ ఏడాది చివర్లో న్యూయార్క్లో జరిగిన UN జనరల్ అసెంబ్లీ సందర్భంగా బ్రిక్ దేశాల విదేశాంగ మంత్రుల మొదటి సమావేశంలో జరిగింది. తొలి బ్రిక్ సమ్మిట్ 2009లో రష్యాలోని ఎకాటెరిన్బర్గ్లో జరిగింది. 2011లో సాన్యాలో జరిగిన 3వ BRICS సమ్మిట్లో దక్షిణాఫ్రికా చేరడంతో BRICని BRICSగా మార్చారు.
Also Read: బ్రెజిల్లో బ్రిక్స్ దేశాల సదస్సు.. డాలర్ వ్యతిరేక కూటమిపై ట్రంప్ గుస్సా!
2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ పూర్తి సభ్య దేశాలుగా చేరాయి. జనవరి 2025లో ఇండోనేషియా సభ్య దేశంగా చేరగా, బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్లను బ్రిక్స్ లో భాగస్వామి దేశాలుగా చేరాయి. బ్రిక్స్ వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, స్థిరమైన అభివృద్ధిలో డైనమిక్ ఫోరమ్గా ఎదిగింది. 2026లో భారత్ బ్రిక్స్కు నాయకత్వం వహిస్తుంది.