IndiGo Flight: దిల్లీ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విశాఖపట్నం నుంచి దిల్లీకి వస్తున్న ఇండిగో విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. పైలట్ ఇంజన్ విఫలమైనట్లు అనుమానం వ్యక్తం చేయడంతో.. ఎయిర్ పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరికి పైలెట్ చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేయడంతో పెనుముప్పు తప్పింది.
ఇండిగోకు చెందిన బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్ 6E 579.. శనివారం ఉదయం విశాఖ పట్నం నుంచి దిల్లీకి బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం మార్గం మధ్యలో ఉండగా.. ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలెట్ గుర్తించారు. వెంటనే దిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు.
Also Read: Bhadrachalam vs Ayodhya: మోదీ గారు.. మా భద్రాచల రామయ్య దేవుడు కాదా? ఎందుకీ వివక్ష?
పైలెట్ ఇచ్చిన సమాచారంతో దిల్లీ ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ కు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. దీటుగా ఎదుర్కొనేందుకు ఫైర్ సిబ్బంది, భద్రతా బలగాలను మోహరించారు. ఈ క్రమంలో ఆకాశంలో కొద్దిసేపు చక్కర్లు కొట్టిన పైలెట్.. చివరికి ఉదయం 10:45 నిమిషాలకు సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు విమానాశ్రయ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ల్యాండింగ్ అనంతరం.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ఎత్తివేసి.. యథావిధిగా ఫ్లైట్స్ రాకపోకలను కొనసాగించారు.
Also Read: Bandi Sanjay: రేవంత్తో కేసీఆర్ కుమ్మక్కు.. కవిత కొత్త పార్టీపై.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు