Indigo Crisis Recovery: గత కొన్ని రోజులు తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఇండిగో సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పట్టింది. వ్యవస్థలో ఏర్పడిన లోపాల కారణంగా అనేక ఫ్లైట్లు రద్దుకావడం, ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లో చిక్కుకోవడం, సామానుల నిర్వహణలో ఏర్పడిన గందరగోళం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైన నేపథ్యంలో, సంస్థ చేపట్టిన పునరుద్ధరణ చర్యలు ఫలితమిస్తున్నాయని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు.
డిసెంబర్ 9 నుండి సంస్థ కార్యకలాపాలు తిరిగి స్థిరపడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా వ్యవస్థపై భారీ ఒత్తిడి వచ్చినా, వేగంగా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఇండిగో నెట్వర్క్లోని 138 గమ్యస్థానాలకు మళ్లీ పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వచ్చాయి. టైమ్ మేనేజ్మెంట్లో కీలకమైన ఆన్ టైం పర్ఫార్మెన్స్ (OTP) కూడా సాధారణ స్థాయికి చేరిందని ఆయన తెలిపారు.
అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశాల్లో ఒకటైన బ్యాగేజీ సమస్యను సంస్థ ప్రాధాన్యంగా తీసుకుంది. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వేలాది బ్యాగులు ఇప్పటికే సంబంధిత ప్రయాణికులకు పంపిణీ చేశామని, మిగతా సామానులు కూడా త్వరితగతిన చేరేలా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని ఎల్బర్స్ వివరించారు.
అలాగే రద్దైన ఫ్లైట్లకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు లేకుండా, తక్షణ రిఫండ్ ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు లక్షల్లో ప్రయాణికులు పూర్తి రిఫండ్ పొందారని ఆయన ధృవీకరించారు. రద్దు, ఆలస్యాలు వంటి పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక ఇబ్బందులు పడకుండా వ్యవస్థను మెరుగుపర్చామని తెలిపారు.
ఈ సమస్య ఎలా వచ్చిందో, ఎక్కడ లోపాలు జరిగాయో లోతుగా విశ్లేషిస్తున్నట్లు ఎల్బర్స్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు పునరావృతం కాకుండా మరింత బలమైన, రోబస్టు వ్యవస్థను తయారు చేయడమే ఇండిగో లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుగుతున్నాయని, మద్దతుతో ముందుకు సాగుతున్నామని సీఈవో వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రయాణికులు తమపై చూపుతున్న నమ్మకాన్ని ఎల్బర్స్ అభినందించారు. మళ్లీ ఇండిగో ఫ్లైట్ల బుకింగ్స్ పెరగడం సంస్థకు కొత్త ఉత్సాహాన్ని కలిగించిందని ఆయన అన్నారు.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో డీజీసీఏ జోక్యం చేసుకుంది. దేశ విమానయాన రంగం మొత్తం ప్రభావితం కాకుండా ఉండేందుకు సంస్థ సేవలను తాత్కాలికంగా 10% తగ్గించాలని ఆదేశించింది. రోజుకు సుమారు 2200 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నడిపే ఇండిగో, డీజీసీఏ ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజూ 220 ఫ్లైట్లు తగ్గించనుంది.
Also Read: ఎస్ఐఆర్ కంటిన్యూ చేయాల్సిందే.. రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు
సవరించిన షెడ్యూల్ను బుధవారం సాయంత్రం వరకు సమర్పించాలని.. ఇండిగోకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు అసౌకర్యం తలెత్తకుండా ఈ మార్పులను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.