Viral News : అసలే ఖైదీలు. నాలుగు గోడల మధ్య నలిగిపోతుంటారు. బయటి గాలి సోకక కాక మీదుంటారు. ఆడ గాలి కోసం ఆవురావురమంటారు. జైలు, కోర్టు, జైలు. ఇదే వారి జీవితం. ఇంకెన్నాళ్లు ఇలా ఒంటరి బతుకు అనుకున్నారు. భార్య విరహంతో రగిలిపోయాడు ఓ ఖైదీ. గర్ల్ఫ్రెండ్ తాపంతో తపించిపోయాడు ఇంకో ఖైదీ. వారికి మరో ఇద్దరు ఖైదీలు తోడయ్యారు. ఇలాగైతే లాభం లేదని.. ఆ నలుగురు కలిసి ఓ ఖతర్నాక్ ప్లాన్ వేశారు.
భార్యతో.. హోటల్ గదిలో..
వైద్య పరీక్షల కోసం జైలు నుంచి ఆ ఖైదీలను బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. సాయంత్రమైనా ఖైదీలు కానీ, ఖాకీలు కానీ తిరిగి రాలేదు. అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏమైందని ఆరా తీశారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. తమ వెంట వచ్చిన గార్డులను కొనేశారు ఖైదీలు. తలా రూ.5వేలు ఇచ్చారు. సాయంత్రం వరకు తాము అలా అలా తిరిగొస్తామని బేరం కుదుర్చుకున్నారు. 5వేలకు కక్కుర్తి పడిన ఆ జైలు గార్డులు ఆ నలుగురు ఖైదీలను వదిలేశారు. వారిలో రఫీక్ అనే ఖైదీ ఓ హోటల్ రూమ్ బుక్ చేసుకుని.. భార్యను అక్కడికి రప్పించుకున్నాడు. ఆమె మరీ యాక్టివ్గా ఉంది. వస్తూ వస్తూ తనతో పాటు డ్రగ్స్ కూడా తీసుకొచ్చింది. అంతే. ఆ తర్వాత ఆ ఇద్దరూ… ఆ గదిలో…….
లవర్తో రంజుగా..
ఇంకో ఖైదీ భన్వర్ లాల్ కథ వేరే. అతను తన లవర్ను పిలిపించుకున్నాడు. వాళ్లిద్దరూ మరో రూమ్లో కిందామీదా పడ్డారు. అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే మరో ఇద్దరు ఖైదీలు ఎయిర్పోర్టు సమీపంలో హోటల్ తీసుకుని రిలాక్స్ అయ్యారు. ఇలా ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్లు మునిగిపోవడంతో.. సాయంత్రం అయింది తిరిగి జైలుకు వెళ్లాలనే విషయం మర్చిపోయారు. ఖైదీలు మర్చిపోయినా పోలీసులు వదలరుగా.
ఐదుగురు సస్పెండ్
నలుగురు ఖైదీలు కనిపించడం లేదనే మేటర్ బ్రేకింగ్ న్యూస్గా మారింది. వెంటనే పోలీసులు, జైలు అధాకారులు రంగంలోకి దిగారు. గార్డుగా వెళ్లిన సిబ్బందిని ప్రశ్నిస్తే జరిగిందేంటో తెలిసిపోయింది. వెంటనే సిటీలోని హోటల్స్ అన్నీ గాలించారు. ఆ నలుగురు ఖైదీలను పట్టుకున్నారు. వారికోసం వచ్చిన వాళ్లను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐదుగురు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేశారు. కేవలం భార్యతో, గర్ల్ ఫ్రెండ్తో మజా చేయడమే కాదు.. అట్నుంచి అటే పారిపోవాలని కూడా స్కెచ్ వేశారట ఆ నలుగురు ఖైదీలు. ఇదంతా జైపూర్లో జరిగింది.
జైలు నుంచి సీఎంకు ఫోన్
ఆ జైలులో ఇలాంటి ఘటనలు ఇంకా చాలానే జరుగుతున్నాయట. లంచాలు ఇస్తూ జైల్లో కానిస్టేబుళ్ల ఫోన్లు వాడుతున్నారని గుర్తించారు. ఆ ఫోన్లతో జైల్లో ఉంటూనే సెటిల్మెంట్లు, బెదిరింపులకు దిగుతున్నారని తెలుస్తోంది. ఏకంగా సీఎం భజన్లాల్ శర్మకే కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. పలువురు ప్రముఖులకు ఫోన్ చేసి జైలు నుంచే దమ్కీ ఇస్తూ దందాలు చేస్తున్నట్టు తేల్చారు. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.