Kangana says same respect as Amitabh: బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరంలేదు. పాపులర్ నటి మాత్రమేకాదు.. వివాదాలకు కేరాఫ్గా ఈమెని చెబుతారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారంలో సొంత డబ్బా కొట్టుకున్నారామె. ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్తో సమానంగా అంతటి గౌరవం, ప్రేమ తాను పొందుతున్నట్లు ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు.
షూటింగులు కోసం తాను రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, మణిపూర్ ఇలా చాలా రాష్ట్రాలు వెళ్లానని, అక్కడి ప్రజలు తనను ఎంతగానో ఆదిరిస్తున్నారని మనసులోని మాట బయటపెట్టారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో తీరిక లేకుండా రోడ్ షోలు, సభలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేసి చేసి ఆమెకు బోర్ కొట్టడంతో ఈసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన రేంజ్ని గుర్తు చేశారామె.
ప్రచారంలో కంగనా నోరు జారిన సందర్భాలు లేకపోలేదు. రీసెంట్గా సొంత పార్టీ నేతపైనే తీవ్ర విమర్శలు గుప్పించారామె. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ బంగాళ దుంపలు పండించాలని చూస్తే, తేజస్వీ సూర్య గూండాయిజం చేసి చేపలు తినే రకమంటూ విరుచుకుపడ్డారు. నిజానికి ఆమె బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ను లక్ష్యంగా చేసుకున్నారు. కాకపోతే పేరులో తేడాను గమనించ లేక నోరుజారారు. కంగనా మాట్లాడిన వీడియోను తేజస్వీయాదవ్ షేర్ చేసి ఈమె ఎవరు అంటూ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీగా తేజస్వీ సూర్య బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు.