Karnataka Survey: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) పనితీరుపై, ఎన్నికల సంఘం విశ్వసనీయతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ ఆరోపణలు చేస్తున్న వేళ.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన వాదనను ఖండించేలా ఒక నివేదికను విడుదల చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ’ (KMEA) నిర్వహించిన సర్వేలో.. మెజారిటీ ప్రజలు ఈవీఎంలను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు తేలింది.
రాష్ట్రంలోని 102 నియోజవర్గాల్లో 5,100 మందిని ప్రశ్నించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 83.61 శాతం మంది పౌరులు ఈవీఎంలు నమ్మదగినవిగా భావిస్తున్నారు. 2023లో ఇది 77.9 శాతంగా ఉండగా, ఇప్పుడు ప్రజల నమ్మకం మరింత పెరగడం గమనార్హం. 84.55 శాతం మంది భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా కలబురగి డివిజన్లో అత్యధికంగా 83.24 శాతం మంది ఈవీఎంలపై నమ్మకం వ్యక్తం చేశారు.
సొంత పార్టీ ప్రభుత్వమే రాహుల్ గాంధీ ఆరోపణలను పరోక్షంగా తోసిపుచ్చడంతో బీజేపీ (BJP) ఎదురుదాడికి దిగింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. “కర్ణాటక ప్రభుత్వ నివేదిక రాహుల్ గాంధీ అసత్య ప్రచారానికి గట్టి చెంపపెట్టు (Tight Slap). కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈసీ (EC) బాగానే ఉంటుంది, ఓడిపోతేనే నిందలు వేస్తారు. సమస్య ఈవీఎంలలో (Data) లేదు, రాహుల్ గాంధీలోనే ఉంది.” అని ఎద్దేవా చేశారు. ఒమర్ అబ్దుల్లా, సుప్రియా సూలే వంటి ఇండియా కూటమి నేతలు కూడా రాహుల్ వాదనతో విభేదిస్తున్నారని, ఇప్పుడు సొంత పార్టీ సీఎం కూడా అద్దం చూపించారని బీజేపీ విమర్శించింది.
Read Also: ప్రజల కోసమైనా కేసీఆర్ మౌనం వీడాలి!