MLA KP Mohanan: ఎన్నికల సమయంలో.. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగిన చాలా మంది రాజకీయ నాయకులు.. అధికారం వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం సర్వసాధారణమే. ఓట్ల కోసం ఎన్నికల వేళ హామీల జల్లు కురిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు కంటికి కూడా కనిపించరు. పోనీ వాళ్ల దగ్గరికే వెళ్లి సమస్యలు చెప్పుకుందాం అంటే.. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది. దీంతో అలాంటి రాజకీయ నేతలు ఎక్కడ కనిపిస్తే.. అక్కడే చాలా మంది నిలదీస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇది మరింత తీవ్రంగా కూడా అవుతూ ఉంటుంది.
తాజాగా కేరళలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కన్నూర్ జిల్లాలోని కుతుపరంపు నియోజకవర్గానికి చెందిన ప్రజలు.. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే కేపీ మోహనన్ను బహిరంగంగానే నిలదీశారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
సమస్యలతో విసిగిపోయిన ప్రజలు
ఆ ప్రాంత ప్రజలు కొంతకాలంగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా, ఎలాంటి పరిష్కారం జరగలేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక డయాలసిస్ కేంద్రంలో పేరుకుపోయిన చెత్త సమస్యను తొలగించమని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని వారు తెలిపారు. ఆసుపత్రి చుట్టుపక్కల వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసనతో పాటు వ్యాధుల ప్రబలే ప్రమాదం పెరిగిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ఎమ్మెల్యే మోహనన్ అంగన్వాడీ ప్రారంభోత్సవానికి చేరుకున్న వెంటనే ప్రజలు అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను ప్రశ్నిస్తూ మా సమస్యల పరిష్కారం కోసం మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ నిలదీశారు. ఆగ్రహావేశంలో కొందరు ప్రజలు ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని లాగడంతో ఉద్రిక్తత నెలకొంది. కొద్ది సేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
పోలీసులు రంగప్రవేశం
సంఘటన స్థలంలో వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లే క్రమంలో ప్రజలతో మాట్లాడి శాంతింపజేశారు. చివరికి పరిస్థితి అదుపులోకి వచ్చి, ఉద్రిక్తత మరింతగా పెరగకుండా పోలీసులు సమర్థంగా వ్యవహరించారు.
Also Read: సర్ క్రీక్ పై చేయి వేస్తే కరాచీని లేపేస్తాం – రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్
రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక ఎమ్మెల్యేకు ప్రజలు ఇంత తీవ్రంగా స్పందించడం, ఆయనపై బహిరంగ ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా అరుదు. దీనివల్ల ప్రజల అసహనం ఎంత పెరిగిందో అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించకపోతే, వారు ఈ తరహా ఆందోళనలకు దిగడం సహజమేనని కొంతమంది భావిస్తున్నారు.
సమస్యలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
కేరళ ఎమ్మెల్యే కేపీ మోహనన్కు చేదు అనుభవం
కన్నూర్ జిల్లాలోని కుతుపరంపు నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే మోహనన్
ఎమ్మెల్యే వస్తున్న విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న… pic.twitter.com/uZ3IrR9T0v
— BIG TV Breaking News (@bigtvtelugu) October 4, 2025