Lohagad Murder: మహారాష్ట్ర పుణెలోని లోహగఢ్ కోటలో జరిగిన హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాబోయే భర్త అగర్వాల్ ను.. ప్రియుడితో కలిసి సియా గోయల్ చంపడం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. కోటలోని ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి కేతన్ ను కిందికి తోసి హత్య చేశారు. అయితే ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకులు సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. లోహగఢ్ కేతన్ ను కిందికి తోసిన ప్రాంతానికి సియా పాయింట్ గా నామకరణం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
కేతన్ అగర్వాల్ హత్య తర్వాత.. లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో సెలవు రోజుల్లో దాదాపు 1,000 మంది పర్యాటకులు వచ్చేవారని ఇప్పుడా సంఖ్య 1,500 దాటిందని వారు పేర్కొన్నారు. అలాగే సాధారణ రోజుల్లో 400గా ఉండే పర్యాటకుల సంఖ్య.. ఇప్పుడు 600 మార్కును దాటేసిందని వెల్లడించారు.
కోటను సందర్శించడానికి వస్తున్న వారిని పలకరిస్తే అందరూ ఒకే మాట చెబుతున్నారు. తాము చారిత్రక ప్రదేశాన్ని చూడటానికి కంటే ఆ హత్య ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనే ఉత్సుకతతోనే వచ్చామని చెబుతున్నారు. ‘నిజానికి మేము విసాపూర్ కోటకు ట్రెకింగ్కు వెళ్లాలని అనుకున్నాం. కానీ కేతన్ అగర్వాల్ హత్య ఉదంతం మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అసలు అక్కడ ఏం జరిగిందో, ఏ స్పాట్ నుండి తోసేశారో చూడాలని ఇక్కడికి వచ్చాం’ అని ఒక పర్యాటకుడు తెలిపాడు.
మరో పర్యాటకుడు ప్రతీక్ బన్సోడే మాట్లాడుతూ ‘నేను కోట పైకి వెళ్లిన వెంటనే నా మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన ఒకటే. కేతన్ను ఎక్కడి నుండి తోసేశారనేది చూడాలని అనుకున్నా. ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఆ హత్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ స్పాట్ చూసినప్పుడు మనసు కలచివేసింది. పెళ్లి గురించి ఎన్నో కలలు కన్న ఆ యువకుడిని ఎంత దారుణంగా పొట్టనబెట్టుకున్నారో అనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
కేతన్ అగర్వాల్ హత్య సమాజానికి ఒక హెచ్చరిక లాంటిదని కోటకు వచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎవరినైనా ప్రేమించినా సరే గుడ్డిగా నమ్మేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ‘నిజానికి కేతన్ను చంపడానికి వారు నాలుగు రోజుల క్రితమే ఇదే కోటపై ప్రయత్నించారు. కానీ అతను తప్పించుకున్నాడు. అంత జరిగినప్పటికీ ఆమెను నమ్మి మళ్లీ ఇక్కడికి రావడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది’ అని ఓ పర్యాటకుడు వాపోయాడు.
Also Read: బయట వర్షం.. ఇంట్లో ఏసీ లీకేజీ.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
జూన్ 18వ తేదీ ఉదయం కేతన్ తన ఇంటి నుండి బయలుదేరి పూణె – ముంబై హైవేపై ఉన్న కివాలే బ్రిడ్జ్ వద్ద సియా (20)ను పికప్ చేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి లోహగఢ్ కోటకు వెళ్లాడు. ఆ తర్వాత ఉదయం 10:45 గంటల ప్రాంతంలో సియా.. కేతన్ తల్లికి ఫోన్ చేసి అతను ప్రమాదవశాత్తు కోట పైనుంచి లోయలో పడిపోయాడని నమ్మించింది. మొదట దీన్ని ప్రమాదంగా భావించినప్పటికీ కేతన్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ హత్యకు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారని, 4 రోజుల క్రితం కూడా ఇలాగే తోసేయడానికి ప్రయత్నించారని విచారణలో తేలింది. కాగా ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉండటం గమనార్హం.
Also Read: SIR భాష వివాదం.. హైకోర్టులో ఆసక్తికర వాదనలు.. ఈసీకి జడ్జి సూటి ప్రశ్న!