లోక్సభలో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆశించిన ఫలితం దక్కలేదు. పార్లమెంటు స్థానాల సంఖ్యను 850కి పెంచాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోయింది. దిగువ సభలో జరిగిన ఓటింగ్లో ఈ బిల్లుకు సరిపడా మద్దతు లభించలేదు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఓటింగ్లో పాల్గొన్న 528 మంది ఎంపీలు..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటు వేశారు. సాధారణ మెజారిటీ లభించినప్పటికీ రాజ్యాంగపరమైన ప్రత్యేక మెజారిటీ నిబంధనను ప్రభుత్వం అందుకోలేకపోయింది. దీంతో సీట్ల పెంపు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
విపక్షాలు ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తగిన కసరత్తు లేకుండా సీట్ల సంఖ్య పెంచడం సరికాదని వాదించాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ వివరణ సభ్యులను పూర్తిగా సంతృప్తి పరచలేదు. తాజా ఫలితంతో అధికార పక్షం తదుపరి కార్యాచరణపై సందిగ్ధత నెలకొంది.
మిగిలిని 2 బిల్లులను వెనక్కి తీసుకున్న మోదీ సర్కార్..
మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోగా.. డీలిమిటేషన్, యూటీ చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ పరిణామం ఎన్డీఏకు బిగ్ షాక్ లాంటిదని విశ్లేషకులు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు ఏకతాటిపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంటున్నారు. విపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందని చెబుతున్నారు.
ALSO READ: Ysrcp : ప్రత్యేక హోదా లాగే డెలిమిటేషన్.. బాబు ఊరుకుంటారా?