Congress MPs Suspended: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో సభా మర్యాదలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు సహా 8 మందిపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభలో గందరగోళం సృష్టిస్తూ, సెక్రటరీ జనరల్ బెంచ్ పైకి ఎక్కి పేపర్లు విసిరిన ఘటనను తీవ్రంగా పరిగణించిన స్పీకర్, సభా హుందాతనాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాల అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది.
సస్పెన్షన్కు గురైన వారిలో మాణిక్యం ఠాగూర్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, హిబి ఈడెన్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, మరో సభ్యుడు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిధుల కేటాయింపులపై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల వైపు చూస్తూ, “యార్ ఏంటి..? పార్లమెంట్లో ఇవేం మాటలు..?” అని గద్దిస్తూ, ప్రజాస్వామ్య దేవాలయంలో వాడే పదజాలంపై నియంత్రణ ఉండాలని హెచ్చరించారు.
సభను సజావుగా నడిపించేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, పీఠం వైపు కాగితాలు విసిరిన సభ్యులపై వేటు తప్పలేదు. ఈ చర్యను విపక్ష నేతలు గొంతు నొక్కే ప్రయత్నంగా అభివర్ణించగా, అధికార పక్ష సభ్యులు మాత్రం సభా గౌరవాన్ని కాపాడటానికి ఇది అవసరమని సమర్థించుకున్నారు. ‘యార్’ వంటి అనధికారిక పదాల వినియోగం, అనుచిత ప్రవర్తన పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని రికార్డుల్లో పేర్కొన్నారు.
లోక్సభలో తనతో పాటు మరో ఏడుగురు ఎంపీలపై వేసిన సస్పెన్షన్ వేటుపై పార్లమెంట్ బయట కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నిర్ణయం పూర్తిగా ఏకపక్షమని, బీజేపీ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరుగుతున్న సమయంలో, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా ఆయన మైకును కావాలనే కట్ చేశారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాల్లో దేశ ప్రయోజనాల దృష్ట్యా వాస్తవాలను మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే, అధికార పక్షం సభను వాయిదా వేయించేలా ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ మైక్ ఎందుకు కట్ చేశారని ప్రశ్నించడానికి తాము స్పీకర్ పోడియం ముందుకు వెళ్తే, దానిని కారణంగా చూపి ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.
Read Also: Mahabubabad: వారిద్దరు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారు.. అందుకే పార్టీ మారుతున్నా..?