Manipur army stopped by women protestors: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించా ఫలితం లేకుండాపోయింది. ఇందుకు సంబంధించి అధికారుల వివరాల ప్రకారం.. మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లా కుంభీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సైనిక సిబ్బందిని వందలాదిమంది మహిళలు అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
అయితే, గత ఏడాది మేలో మొదలైన అల్లర్లు ముగిసేవరకు ఎలాంటి ఆయుధాలు జప్తు చేయొదన్నారు. ఈ క్రమంలో వారు రోడ్డుకు అడ్డం తిరిగి ఆర్మీ కాన్వాయ్ ను కదలనీయకుండా అడ్డుకున్నారు. అయితే, వారిని చెదరగొట్టేందుకు బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. అయినా కూడా వారు అక్కడి నుంచి కదలకపోవడంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఆయుధాలను పోలీసులకు ఇస్తామని సైనిక సిబ్బంది చెప్పడంతో వారు శాంతించారు.
Also Read: ‘కలలు కనకండి.. ఎప్పటికీ అలా జరగనివ్వం’
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుంభీ వంటి సరిహద్దు ప్రాంతంలో కాపలాగా ఉన్న గ్రామ వాలంటీర్ల వద్ద నుంచి ఆయుధాలను జప్తు చేయడం వల్ల చురాచాంద్ పుర్ జిల్లా పక్కనే ఉన్న కొండ ప్రాంతాల నుంచి సాయుధ మిలిటెంట్లు దాడులు చేసే అవకాశముందంటూ వారు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ సాధారణ స్థితి నెలకొన్నదని, ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సైనిక సిబ్బంది వెనుదిరిగారని అధికారులు తెలిపినట్లు సమాచారం.