Big Shock To Maoist Party: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు నేత, ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ ఎలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన సహా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని దారేక్ష పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన అందరం లొంగిపోతామని లేఖ విడుదల చేసిన రోజే సరెండర్ అయ్యారు. అనంత్పై 5 రాష్ట్రాల్లో కలిపి కోటి రివార్డు ఉంది.
లొంగిపోయిన వారిలో ఎంఎంసీ ఇంఛార్జి, విస్తార్ మూడో ప్లటూన్ కమాండర్ సురేంద్ర ఎలియాస్ మద్వి సీమ సైతం ఉన్నారు. ఈయనపై 60 లక్షల రివార్డు ఉంది. 15 మంది మావోయిస్టుల పేరుపై మూడురాష్ట్రాల్లో మొత్తం 2 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఏకే 47, ఎస్ఎస్ఆర్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, సింగిల్ షాట్ ఆయుధాలు, డిటోనేటర్లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులను జనజీ వన స్రవంతిలో కలిపేందుకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని చెప్పారు. జనవరి 1న అందరం లొంగిపోతా. మని గురువారం నాడు లేఖను విడుదల చేసిన అనంత్.. అదే రోజు లొంగిపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే చర్చ జరుగుతోంది.
ఇటు ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో వరంగల్ జిల్లాకు చెందిన శ్యాందాదా అలియాస్ చైతు పోలీసులు ఎదుట లొంగిపోయారు. జగదల్ పూర్లో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఎదుట శ్యాం దాదా సహా 10 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. వీరిపై మొత్తంగా 66 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలియజేశారు.
స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతుకు 25 లక్షల రివార్డు ప్రకటించారు. చైతు ప్రధానంగా జిరామ్ లోయ దాడికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. చాలా కాలంగా దర్భా డివిజన్కు బాధ్యత వహించాడు. నక్సలైట్ వ్యతిరేక కార్యకలాపాలలో దళాల నుండి పెరుగుతున్న ఒత్తిడితో పాటు సీనియర్ మావోయిస్టు నాయకులు నిరంతరం లొంగిపోవడం.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవాలని నిరంతరం విజ్ఞప్తి చేయడంతో నక్సలైట్లు లొంగిపోయారు.
Also Read: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. స్పాట్లో ఐదుగురు మృతి
అంతకముందు మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. జనవరి 1న సాయుధ కాల్పులు విరమిస్తామంటూ.. MMC జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు అంతా కలిసి లొంగిపోతామని లేఖలో పేర్కొన్నారు. కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా విడుదల చేశారు. అయితే అధిక ప్రాధాన్యతిచ్చే సర్కార్తో వెళ్తామని మావోయిస్టులు చెబుతున్నారు. కాగా.. ఇప్పటికే అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగిపోయారు. అటు హిడ్మా ఎన్ కౌంటర్తో మావోయిస్టు పార్టీ మరింత బలహీనమైంది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు మనుగడకు ముప్పుగా మారింది.