దావూద్ ఇబ్రహీం. ఒకప్పుడు ముంబై నగరాన్ని వణికించిన పేరు అది. అండర్ వరల్డ్ కి మారుపేరు కూడా. అలాంటి దావూద్ ఇబ్రహీం ఇప్పుడు కలుగులో దాక్కున్న ఎలుకలా కాలం గడుపుతున్నాడు. దావూద్ భారత దేశం నుంచి పారిపోయాడు కానీ, అతడి ఆస్తులు ఇంకా ఇక్కడే ఉన్నాయి. స్థిర చరాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని వేలం వేసింది. అయితే దావూద్ ఇబ్రహీంకి చెందిన ఒక ఇల్లుని మాత్రం వేలంలో ఎవరూ కొనడానికి సాహసం చేయలేదు. అసలా ఇల్లు ఎక్కడుంది..? అక్కడ ఇప్పుడు ఎవరు ఉన్నారు..? దాని సంగతేంటి..?
యూట్యూబర్లకు ఫేవరెట్ ప్లేస్..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇల్లు అది. ఒకప్పుడు చోటా మోటా డాన్లతో ఆ ఇళ్లు సందడిగా ఉండేది. సెటిల్మెంట్లకు అడ్డాగా ఆ ప్యాలెస్ కి పేరుంది. కానీ ఇప్పుడది శిథిలావస్థకు చేరింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకాలోని ముంబాకే గ్రామంలో ఆ బిల్డింగ్ ఉంది. అది దావూద్ కి వారసత్వంగా వచ్చిన బంగ్లా. ఆయన పూర్వీకుల స్థలంలో కట్టిన పెద్ద భవనం. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరు. పేరుకి ప్రభుత్వ అధీనంలో ఉన్నా.. కనీసం సెక్యూరిటీ కూడా పెట్టలేదు. చాలామంది యూట్యూబర్లు ఆ బిల్డింగ్ లోకి వెళ్లి దాన్ని ఎక్స్ ప్లోర్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. శిథిలావస్తలో ఉన్న ఆ ఇంటి చుట్టూ చిట్టడవిలాగా చెట్లు పెరిగిపోయాయి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ఇబ్రహీం మాన్షన్
ఆ బిల్డింగ్ పేరు “ఇబ్రహీం మాన్షన్”. రెండంతస్తుల్లో విశాలంగా నిర్మించారు. దావూద్ ఇబ్రహీంతోపాటు అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు అక్కడే నివశించడానికి వీలుగా నిర్మించారు. 1980లలో దావూద్ భారతదేశం నుండి పారిపోయిన తర్వాత, ఆ ఇల్లు ఖాళీగా మిగిలిపోయింది. అప్పట్నుంచి దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్నాళ్లపాటు అతని సోదరి హసీనా పార్కర్ ఆ ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంటివైపు ఎవరూ రావట్లేదు.
ఒకప్పుడు సెటిల్మెంట్లకు అడ్డాగా ఉన్న ఇబ్రహీం మాన్షన్.. ఇప్పుడు పగుళ్లిచ్చిన గోడలు, శిథిలమైన శ్లాబ్, విరిగిన కిటికీలు, పెరిగిన మొక్కలతో హాంటెడ్ హౌస్ లాగా కనపడుతుంది. లోపలికి వెళ్లడం నిషిద్ధం అంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డ్ దాని ముందు ఉంటుంది. అయితే అది దావూద్ ఇల్లు అని తెలిసిన వారు మాత్రం లోపల ఏముందో చూద్దామని ఆసక్తిగా వెళ్తుంటారు. ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం భారత్ నుంచి పారిపోయిన తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వం జప్తు చేసింది. 2001లో ఢిల్లీకి చెందిన న్యాయవాది అజయ్ శ్రీవాస్తవ.. దావూద్ ఇల్లు సహా మరికొన్ని ఆస్తుల్ని వేలంలో కొనుగోలు చేశాడు. అయితే వాటి రిజిస్ట్రేషన్ విషయంలో చిక్కులు ఎదురయ్యాయి. చివరకు 2023లో వాటి రిజిస్ట్రేషన్ పూర్తయింది.
దావూద్ ఇల్లు మాత్రం ప్రస్తుతానికి శిథిలావస్థలో ఉంది. దాన్ని బాగుచేసి స్కూల్ గా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంత సులభం కాదని తాజా వీడియోల ద్వారా తెలుస్తోంది. దావూద్ ఇల్లు మొత్తం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఇల్లు నివశించడానికి కానీ, స్కూల్ బిల్డింగ్ లా ఉపయోగించడానికి కానీ పనికి రాదని అంటున్నారు. మరి దాన్ని ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది.