విద్యార్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. చమురు సహజవాయువుల రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) పేద విద్యార్థుల కోసం భారీ స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించింది. సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ అలాగే ఆర్థికంగా వెనుకబడిన జనరల్ (ఈడబ్ల్యూఎస్) విభాగాల విద్యార్థులను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే 15 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
స్కాలర్ షిప్ వివరాలు: ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 2000 ఉపకార వేతనాలను సంస్థ అందిస్తోంది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీలకు 1000 సీట్లు కేటాయించగా ఓబీసీలకు 500 అలాగే జనరల్ అభ్యర్థులకు 500 స్కాలర్షిప్పులు కేటాయించారు.
ఏడాదికి ఎంతంటే..?: మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని విభాగాల్లోనూ 50 శాతం నిధులను విద్యార్థినులకే కేటాయించడం గమనార్హం. ఎంపికైన ప్రతి విద్యార్థికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.48,000 ఆర్థిక సాయం అందుతుంది. సంబంధిత కోర్సు పూర్తయ్యే వరకు ఈ ప్రోత్సాహకం నిరంతరాయంగా కొనసాగుతుంది.
విద్యార్హతలు: అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఫుల్టైమ్ రెగ్యులర్ కోర్సులు చదువుతూ ఉండాలి. ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్) ఎంబీబీఎస్ వంటి ప్రథమ సంవత్సర విద్యార్థులు లేదా పీజీ స్థాయిలో జియాలజీ, జియోఫిజిక్స్, ఎంబీఏ కోర్సుల్లో చేరిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఇంటర్మీడియట్ స్థాయిలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారు ఇంజినీరింగ్ ఎంబీబీఎస్ కోర్సులకు పోటీ పడవచ్చు. పీజీ కోర్సుల విద్యార్థులు డిగ్రీలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.
వార్షిక ఆదాయం ఎంత ఉండాలంటే..?: కుటుంబ వార్షిక ఆదాయం ఎస్సీ ఎస్టీలకు రూ.4.5 లక్షలు ఉండగా మిగిలిన వారికి రూ.2 లక్షలకు మించకూడదు.
వయోపరిమితి: నిబంధనల ప్రకారం 2025 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. ఇంజినీరింగ్ ఎంబీబీఎస్ అభ్యర్థులను వారి ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పీజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే..? దేశాన్ని ఐదు జోన్లుగా విభజించి ఒక్కో జోన్ నుంచి నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు జోన్ 5 పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200 అలాగే ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు చెరో 100 చొప్పున స్కాలర్షిప్పులు అందుతాయి.
దరఖాస్తుదారులు ఇతర ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల నుంచి స్కాలర్షిప్ పొందుతూ ఉండకూడదు. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP)లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ఓఎన్జీసీ అధికారిక వెబ్సైట్లో వయసు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు పదో తరగతి, ఇంటర్ డిగ్రీ మార్కుల జాబితాలను అప్లోడ్ చేయాలి.
బ్యాంకు అకౌంట్ పాన్ కార్డు కాలేజీ ఐడీ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. విద్యా సంవత్సరం ముగిసే సమయానికి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే తదుపరి ఏడాదికి ఈ స్కాలర్షిప్ రెన్యూవల్ అవుతుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://ongcscholar.org/
ALSO READ: Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసు కొత్త మలుపు.. ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాను, కేజ్రీవాల్ సంచలన నిర్ణయం