Odisha Vigilance: ఒడిశా గనుల శాఖలో భారీ అవినీతి తిమింగలం పట్టుపడింది. కటక్ సర్కిల్లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి గత రాత్రి బొగ్గు వ్యాపారి నుంచి రూ.30,000 లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో విజిలెన్స్ అధికారులు అతని ఇల్లు, మాతాసాహిలోని అతని తల్లిదండ్రుల ఇల్లు, కటక్లోని అతని ఆఫీసులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ట్రాలీ బ్యాగులు, అల్మారాల్లో దాచిన రూ.4 కోట్లకు పైగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అత్యధిక నగదు స్వాధీనం కేసుగా అధికారులు చెబుతున్నారు.
ఒడిశా విజిలెన్స్ కటక్ సర్కిల్ గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతిని అరెస్టు చేసింది. భువనేశ్వర్లోని ఆయన ఫ్లాట్, ఇతర ప్రదేశాలలో జరిపిన సోదాల్లో రూ.4 కోట్లకు పైగా నగదు సీజ్ చేసింది. అలాగే అతని ఆఫీస్ లో రూ.1.20 లక్షలు స్వాధీనం చేసుకుంది. భువనేశ్వర్లోని రెండోతస్తుల భవనం, సుమారు 130 గ్రాముల బంగారం వంటి ఇతర ఆస్తులు కూడా దొరికాయి. విజిలెన్స్ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
గతంలో గంజాం జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ డివిజన్లోని అసిస్టెంట్ ఇంజినీర్ నివాసంలో విజిలెన్స్ అధికారులు అత్యధికంగా రూ.3.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రూ.4 కోట్ల నగదు దొరకడంతో ఇదే భారీగా మొత్తంగా రికార్డుకెక్కింది. అవినీతి నిరోధక సంస్థ స్వాధీనం చేసుకున్న అత్యధిక నగదు ఇదేనని విజిలెన్స్ డైరెక్టర్ యశ్వంత్ జెత్వా తెలిపారు. ఇప్పటివరకు రూ.4.27 కోట్ల విలువైన నగదును లెక్కించినట్లు భువనేశ్వర్ డివిజన్ విజిలెన్స్ ఎస్పీ సరోజ్ కుమార్ సమల్ పేర్కొన్నారు. 2009లో మొహంతిపై ఇలాంటి అవినీతి కేసు నమోదైంది. మయూర్భంజ్ జిల్లాలోని కోర్టులో అతనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ అన్నారు.
అవినీతి అధికారి పట్టుబడడంతో డబుల్ ఇంజిన్ సర్కార్ లో అవినీతి ఎంతగా పెరిగిందో ఈ ఘటన నిదర్శనమని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ అధికార బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.
#WATCH | Following apprehension of Sri Debabrata Mohanty, Deputy Director of Mines, Cuttack Circle, Cuttack, yesterday night for taking a bribe Rs.30,000 from a licensed coal vendor, simultaneous house searches were initiated by Odisha Vigilance at his residential flat, parental… pic.twitter.com/zlRRWm199z
— ANI (@ANI) February 25, 2026
Also Read: రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఎస్ఐ, ఎక్కడో కాదు ఏకంగా పీఎస్లోనే..?
మొహంతి ఆస్తులలో భువనేశ్వర్లో రెండంతస్తుల ఇల్లు, దాదాపు 130 గ్రాముల బంగారం ఉన్నాయి. అంతేకాకుండా, అతని పేరు మీద 2,400 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇక్కడ మరో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొహంతి పేరు మీద 10 బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్నాయి. వాటిని కూడా తనిఖీ చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు అతడిపై నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
మొహంతి 2004లో జూనియర్ మైనింగ్ ఆఫీసర్గా రూ. 8,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. ఆయన కటక్కు బదిలీ అయ్యే ముందు బోలంగీర్, బారిపడ, బెర్హంపూర్లలో పనిచేశారు.