బుధవారం తెల్లవారు ఝామున సరిగ్గా ఒంటి గంటా 44 నిమిషాలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది, బాంబుల వర్షం కురిపించింది. వాస్తవానికి ఇలాంటి వైమానిక దాడుల్ని ముందుగానే పసిగట్టడానికి రాడార్ వ్యవస్థ ఉంటుంది. రాడార్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తే.. ఈ దాడుల్ని ముందుగానే పసిగట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చు. దాడుల్ని ఆపలేకపోవచ్చు కానీ.. ఆస్తినష్టం, ప్రాణ నష్టాన్ని కాస్తయినా తగ్గించవచ్చు. కానీ పాకిస్తాన్ లోని రాడార్ వ్యవస్థ ఈ విషయంలో పూర్తిగా ఫెయిలైంది. దాడి జరిగిన తర్వాతే పాక్ కి ఆ విషయం తెలిసొచ్చింది. కారణం.. పాక్ వాడిన చైనా రాడార్లు.
అంత సీన్ లేదు..
యుద్ధానికి సిద్ధం, సరైన బదులిస్తాం, ధీటుగా ప్రతిఘటిస్తామంటూ పాకిస్తాన్ ఎప్పుడూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటుంది కానీ, యుద్ధమే వస్తే భారత్ ని తట్టుకునే శక్తి పాక్ కి లేదనే విషయం ప్రపంచం మొత్తానికీ తెలుసు. బాలాకోట్ పై వైమానిక దాడుల సమయంలో కూడా పాకిస్తాన్ నిఘా వ్యవస్థ సరిగా పనిచేయలేదు. ఆ తర్వాత భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. అప్పుడు కూడా పాక్ ఆ విషయాన్ని పసిగట్టలేకపోయింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ ని పాక్ రాడార్ వ్యవస్థ గుర్తించలేకపోయింది. అంటే ఆ దేశ నిఘా వ్యవస్థ ఏ స్థాయిలో నిద్రపోతోందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ వైమానిక రక్షణ మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఈ ఘటన నిర్థారించింది.
మేడిన్ చైనా రాడార్లు
2019లో బాలాకోట్ పై భారత్ వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ రాడార్ కవరేజ్ కి అందకుండా ఈ దాడి జరిగింది. బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్ అలర్ట్ అయింది. చైనా నుండి వాయు రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. అయితే ఆ రక్షణ వ్యవస్థలు దారుణంగా ఫెయిలయ్యాయి. ఆ విషయం బ్రహ్మోస్ పరీక్షతో రుజువైంది. 2022 మార్చిలో భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. హర్యానాలోని అంబాలా నుండి సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని భారత్ ప్రయోగించగా, పాక్ దాన్ని గుర్తించలేకపోయింది. ఈ క్షిపణి భారత గగనతలంలో 100 కిలోమీటర్లు, పాకిస్తాన్ గగన తలంపై 105 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు పంజాబ్ ప్రావిన్స్లోని మియాన్ చన్నులో లక్ష్యానికి చేరుకుంది. పాక్ గగన తలంపై 105 కిలోమీటర్ల మేర మన క్షిపణి వెళ్లినా.. పాక్ రాడార్ పసిగట్టలేకపోయింది. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం పూర్తయిన తర్వాతే పాక్ కి ఆ విషయం తెలిసింది.
ఇప్పుడు కూడా..
వాస్తవానికి 2014లో భారత్ లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పాక్ కాస్త అలర్ట్ అయింది. చైనా నుండి 9 డిఫెన్స్ సిస్టమ్స్ ని కొనుగోలు చేసింది. LY-80 LOMADS అనే పేరుతో పిలవబడే ఈ రక్షణ వ్యవస్థ అత్యంత అధునాతనమైనదని పాక్ ప్రచారం చేసుకుంది. చైనా కూడా ఇది టాప్ ఎండ్ సిస్టమ్ అని పాక్ కి అంటగట్టింది. అయితే దాని పనితీరు సరిగా లేదు. అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది LOMADS వ్యవస్థ.
చైనా చీప్ క్వాలిటీ సరుకు గురించి మనకు తెలిసిందే కదా. అయితే పాక్ కి దిక్కులేక చైనా నుంచి ఆ రాడార్లను కొనుగోలు చేసింది. వాటి పనితీరు సరిగా లేదంటూ పాకిస్తాన్ గతంలోనే చైనాకు ఫిర్యాదు చేసింది. LY-80 వ్యవస్థలో 388 లోపాలున్నట్టు గుర్తించింది. వీటిలో కొన్నిటిని చైనా సరిచేసింది. మిగతా లోపాలతోనే ఆ వ్యవస్థను పాక్ ఉపయోగించుకుంటోంది.
చైనా దెబ్బ..
2017లో పాకిస్తాన్ సైన్యంలో చేరిన LY-80 వ్యవస్థ, 15 మీటర్ల నుండి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న క్షిపణుల జాడ పసిగట్టగలదని చైనా హామీ ఇచ్చింది. 40 కిలోమీటర్ల పరిధిలో క్షిపణులు, విమానాలను అడ్డుకోగలదని కూడా తెలిపింది. ఏకంగా 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తిస్తుందని ఊదరగొట్టింది. కానీ అవేవీ సాధ్యం కాలేదు. కనీసం దాడి జరిగే వరకు కూడా పాక్ కి ఆపరేషన్ సిందూర్ గురించి తెలియనే తెలియదు. పాకిస్తాన్ పై భారత్ దెబ్బకంటే, చైనా దెబ్బ గట్టిగా పడినట్టుంది. భారత్ కి చైనా, పాక్ ఉమ్మడి శత్రువులు కావడంతో చైనా నుంచి తమకు సహకారం అందుతుందని పాక్ అంచనా వేసింది. కానీ చీప్ క్వాలిటీ రాడార్లను అంటగట్టి చైనా తమని ఇలా మోసం చేస్తుందని మాత్రం ఊహించలేకపోయింది.