India Vs Pakistan: పహల్గాం ఉగ్రదాడితో దేశ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వెంట పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. వరుసగా రెండో రోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. LOC వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మొదట గురువారం రాత్రి పాక్ సైన్యం కాల్పులకు తెగబడగా.. భారత సైన్యం తిప్పికొట్టింది. అయితే, అంతటితో ఆగకుండా రెండోసారి శుక్రవారం అర్ధరాత్రి కూడా పాక్ సైన్యం కాల్పులకు తెగబడిందని.. భారత్ ఆ చర్యలకు ధీటైన సమాధానం ఇచ్చిందని రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దుస్సాహసానికి పూనుకుంటే ఎలా రక్షించుకోవాలో తెలుసంటూ పొగరుబోతు వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరిస్తామని షెహబాజ్ పేర్కొన్నారు. సింధూ నది పాకిస్థాన్ సొంతమని, ఆ నదీ జలాలను అడ్డుకుంటే రక్తం ఏరులై పారుతుందంటూ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.
మరోవైపు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ఆనవాళ్లపై భారత రక్షణా దళాలు జల్లెడ పడుతున్నాయి. నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా ముఠా సభ్యుల జాడలను గుర్తించడంలో భారత భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరం గుట్టు రట్టు అయింది. ఏకే 47 తుపాకులు ఐదు, భారీ సంఖ్యలో తూటాలు, పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నాయి భారత భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్ జిల్లా ముస్తాకాబాద్ మచిల్లోని సెడోరి నాలా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఈ స్థావరాన్ని ధ్వంసం చేశాయి. ఈ క్రమంలోనే షోపియాన్లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. ఇతడు మూడు నాలుగేళ్లుగా ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు గుర్తించారు. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో ఉగ్రవాది జాహిద్ అహ్మద్ నివాసాన్నీ భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇదే జిల్లాలో మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి.
Also Read: పాక్ కుంభస్థలం బద్దలే.. మ్యాప్ నుండి అవుట్..!
2023 జూన్ నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఇషాన్ పాల్గొంటున్నట్లు గుర్తించారు. ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చాయి. అహ్సన్ 2018లో పాకిస్థాన్ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో హరీస్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటినీ పేల్చివేశాయి. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఖైమోహ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న వీరి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు. సుమారు 60 చోట్ల సోదాలు నిర్వహించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. అనంతనాగ్ జిల్లాలో నిరంతరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు రాష్ట్రాలు పాకిస్థానీలను గుర్తించి వారి స్వదేశానికి పంపించివేస్తున్నాయి.