పహెల్గామ్ దాడికి ప్రతీకారం తప్పదంటూ ప్రధానమంత్రి మోడీ వార్నింగ్ మీద వార్నింగ్.
ఎక్కడా పాకిస్తాన్ పేరెత్తలేదు మన ప్రధాని. కానీ ఈ పది సెకన్ల మాటతో పాపికి ముచ్చెమటలు పడుతున్నాయి.
మోడీ గురి మామీదనే అంటూ డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్న పాక్ నేతలు.
ఊరుకునేది లేదు.. తగ్గేది లేదు.. దాడికి ప్రతి దాడి చేస్తాం.. అవసరమైతే అణుబాంబులు వేస్తాం.. ఇలా పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారు పాక్ ప్రభుత్వ నేతలు. ఒకరు 36 గంటల్లో దాడి జరుగుతుందని చెబుతున్నారు. మరికొందరు దాడి జరిగితే దేశం విడిచి పారిపోతామంటున్నారు. ఇలా పాక్ మాటల్లోనే ఓ భయం కనిపిస్తోంది. పూటకో ప్రకటన చేస్తూ పబ్బం గడుపుతోంది.
ప్రతీకారం తప్పకుండా ఉంటుందని తేల్చేసిన నేతలు
భారత్లో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతీకారం ఉంటుందని తేల్చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు వారి మౌనం పాక్ నేతలకు, అక్కడి ఆర్మీకి నిద్ర లేకుండా చేస్తోంది.
ఇండియన్ నేవి అడ్మిరల్ దినేష్ త్రిపాఠీతో భేటి
ప్రధానమంత్రి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠీతో భేటీ అయిన మోడీ.. ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్తో భేటీ అయ్యారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ విషయాలను గోప్యంగా ఉంచుతోంది ప్రధానమంత్రి కార్యాలయం.
ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధానీ మోదీ
ఇప్పటికే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోడీ. టార్గెట్స్ను సెలెక్ట్ చేసుకోవడం.. దాడి ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీనికి తగ్గట్టుగానే త్రివిధ దళాలు ఇప్పుడు సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి.
రాజ్ నాధ్ సింగ్ రష్యా పర్యటన రద్దు
గంగా ఎక్స్ప్రెస్వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ఎక్సర్సైజ్లను నిర్వహించింది. ఇందులో ఇండియన్ ఎయిర్ఫోర్స్ అమ్ముల పొదిలో ఉన్న అన్ని ఫైటర్జెట్స్తో పాటు.. మధ్యశ్రేణి ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్యారియర్స్ పాల్గొన్నాయి. మరోవైపు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనను రద్దు చేసుకోవడం పాకిస్థాన్లో టెన్షన్ను మరింత పెంచింది. ఈ నెల 9న రాజ్నాథ్ రష్యాలో జరిగే విక్టరీ డే పరేడ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో తమపై దాడి చేయడానికే ఈ పర్యటన రద్దు అనే భయం పట్టుకుంది పాకిస్థాన్కు.
కొత్త పల్లవి ఎత్తుకున్న పాక్ నేతలు
36 గంటల్లో తమపై దాడి జరుగుతుందని ప్రకటించిన పాక్ నేతలు.. అలా జరగకపోవడంతో ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తమపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ దాడులు చేసే అవకాశం ఉందంటూ కొత్తపలుకు పలుకుతున్నారు. ఇంకొన్ని రోజులుపోతే అసలు తాము ఆ ప్రకటనలు చేయడం వల్లే దాడులు ఆగాయని కూడా చెప్పే అవకాశం లేకపోలేదు.
స్లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకు దింపిన భారత్
పాక్ కేవలం మాటలకే పరిమితం కాగా.. భారత్ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా అన్ని చేతల్లో చూపిస్తోంది. ఓ వైపు అన్ని రకాలుగా యుద్ధానికి సన్నద్ధమవుతూనే.. మరోవైపు పాక్ను అష్టదిగ్బంధనం చేసే పనిలో ఉంది. ఇప్పటికే సింధు జలాల పేరుతో వాటర్ బాంబు విసిరింది. తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను భారత్ నిలిపేసింది. స్లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందికి దింపి నీటి సరఫరాను ఆపేశారు. ఈ చర్యతో.. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు నీటి సరఫరా నిలిచిపోతుంది. ఇక దిగుమతులను నిషేధించింది. పాక్ను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు అంతర్జాతీయంగా చేయాల్సి చేస్తోంది.
నాలుగు రోజుల్లోనే పాక్ మందుగుండు ఖాళీ
ఇన్ని మాటలు మాట్లాడుతున్న పాకిస్థాన్ నిజంగా యుద్ధం చేయాల్సి వస్తే.. కేవలం నాలుగు రోజుల్లోనే ఆ దేశ మందుగుండు మొత్తం ఖాళీ అవుతుందని చెబుతున్నాయి రిపోర్టులు. పాక్ శతఘ్నులు, సెల్ఫ్ప్రొపెల్డ్ గన్స్, ఎంజీఎస్ వ్యవస్థల పనితీరు గణనీయంగా పడిపోనుంది. మరోవైపు భారత్లోని 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో మొత్తం జోరుగా ఉత్పత్తి కొనసాగుతోంది.
పెహల్గామ్ ప్రతీకార దాడిని ఊహించుకుంటూ బిక్కచచ్చిపోతోంది
పాక్ ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కేంద్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. కొన్నిసార్లు మౌనం చాలా భయంకరంగా ఉంటుందో.. అదెంత ప్రమాదకరమో పాకిస్తాన్కు బాగా అర్థమవుతోంది. సర్జికల్ స్ట్రైక్ ఏ రేంజ్లో ఉంటుందో గతంలో చవిచూసిన పాకిస్తాన్.. పెహల్గామ్ ప్రతీకార దాడిని ఊహించుకుంటూ బిక్కచచ్చిపోతోంది.