Travel Agents Licences cancel: అమెరికా నుంచి విమానాల్లో అక్రమ వలసదారులు భారత్కు చేరుకుంటున్నారు. స్వదేశానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది నార్తిండియాకు చెందినవారు ఉన్నారు. పంజాబ్, గుజరాత్, యూపీ, హర్యానా ప్రాంతాలకు చెందినవారు ఉన్నట్లు తేలుతోంది. విడతల వారీగా అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం తరలిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ట్రావెల్ ఏజెంట్లపై కొరడా ఝలిపిస్తున్నాయి.
అక్రమ వలసలు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు తలనొప్పిగా మారింది. ఆయా దేశాల్లో జనాభా పెరిగిపోవడం ఒకటయితే, దానివల్ల స్థానికులకు ఉద్యోగాల సమస్య ఏర్పడింది. వివిధ దేశాల్లో ఎన్నికలు సైతం వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. అమెరికాలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో అమెరికాలో అక్రమంగా వలసదారులపై దృష్టి సారించింది. ఒక్క ఇండియా నుంచి అమెరికాలో అక్రమంగా దాదాపు ఏడున్నర లక్షల మంది ఉన్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
ట్రావెల్ ఏజెంట్లపై కొరడా
సరైన పత్రాలు లేకుండా ఫారెన్ దేశాలకు పంపిస్తున్న ట్రావెల్ ఏజెంట్లపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. అమెరికా నుంచి బహిష్కరణకు గురవుతున్న వారిలో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీని వెనుక స్వదేశంలోవున్న నకిలీ ట్రావెల్ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపడం మోపింది. ఈ విషయంలో పంజాబ్ ఓ అడుగు ముందుకేసింది. అమృత్సర్లో మొత్తం 40 మంది ట్రావెల్ ఏజెంట్ల లైసెన్సులను రద్దు చేసింది. మరో 17 మంది ఏజెంట్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేసింది.
ఇటీవల అమెరికా ప్రభుత్వం బహిష్కరించిన ఇండియన్స్ ట్రావెల్ ఏజెంట్లతో డంకీ రూట్ ద్వారా అక్కడికి ప్రవేశించారు. ట్రావెల్ ఏజెంట్లు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోనివారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లైసెన్సులు రెన్యువల్ చేసుకోని 271 మందికి నోటీసులు జారీ చేశారు పంజాబ్ పోలీసులు. ట్రావెల్ ఏజెన్సీలు పక్కాగా రికార్డులు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. అనధికార ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు కూడా.
ALSO READ: ఏఐ వినియోగం.. భారతీయ రైతుల అద్భుతాలు
వివిధ నగరాల్లో పని చేస్తున్న ట్రావెల్ ఏజెంట్లు, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ల డాక్యుమెంట్లను కచ్చితంగా తనిఖీ చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా విదేశాలకు వెళ్తే అందుకు సంబంధించిన అన్ని పత్రాలను కార్యాలయాల్లో ఉంచాలని అధికారులు ఆదేశించారు. రాబోయే రోజుల్లో చాలామంది ఏజెంట్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 345 మందిలో 131 మంది పంజాబ్కి చెందినవారు. వీరంతా నకిలీ ఏజెంట్లతో అమెరికా వెళ్లినట్టు తేలింది. ఈ తరహా ఏజెంట్లను పట్టుకోవడానికి పంజాబ్ ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేసింది.
వందేళ్ల నుంచి వలసలు
పంజాబ్లో వలసలు 1920-30 నుండి జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వారికి కంట్రోల్ చేసిన సందర్భం లేదు. ట్రావెల్ ఏజెంట్లు-ప్రభుత్వం మధ్య సహకారంతో చట్టపరమైన మార్గం ఉండాలన్నది కొందరు నిఫుణుల వాదన. మొదట్లో ఈ సమస్య దోబాలో మాత్రమే ఉండేది. ఇప్పుడు మాల్వా, మాఝాకూ వ్యాపించిందని చెబుతున్నారు. కేవలం పంజాబ్ కు మాత్రమే పరిమితం కాలేదు. గుజరాత్, యూపీ రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా చాలామంది అక్కడికి వెళ్లి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల గురించి చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఏజెంట్లు అక్కడికి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లి నరకం అనుభవించిన సందర్భాలు లేకపోలేదు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. ఇటీవల చాలామందిని స్వదేశాలకు రప్పించిన సందర్భాలు లేకపోలేదు.