Delhi News: దాదాపు నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు వస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీకి రానున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చే ప్రైవేట్ డిన్నర్కు హాజరుకానున్నారు. వివిధ అంశాలతో ఇరుదేశాల మధ్య చర్చ జరగనుంది.
సాయంత్రం ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్
రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీకి రానున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చే విందుకు హాజరవుతారు. ఢిల్లీలో కేవలం 30 గంటలు మాత్రమే ఆయన ఉంటారని తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం అధ్యక్షుడు పుతిన్ తన అధికారిక కార్యక్రమాలు మొదలుపెడతారు. తొలుత రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తారు.ఆ తర్వాత హైదరాబాద్ హౌస్లో 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. భేటీ తర్వాత ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు.
పుతిన్ కాన్వాయ్ మార్గంలో ఐదంచెల భద్రత
ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఇచ్చే వర్కింగ్ లంచ్కు పుతిన్, ఆయన టీమ్ హాజరవుతుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిక్కీ నిర్వహించే కార్యక్రమంలో అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. దీంతో ఆయన భారత టూర్ పూర్తికానుంది.
ముఖ్యంగా చర్చించే అంశాలలో S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కొనుగోలు ఉంది.ఎస్యు-30 ఫైటర్ జెట్ల ఆధునికీకరణ, కీలకమైన మిలటరీ హార్డ్వేర్ సరఫరా వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానం కానున్నాయి. 2018 లో ఐదు S-400 యూనిట్ల కోసం 5 బిలియన్ల ఒప్పందం జరిగింది. ఇప్పటికి మూడింటిని డెలివరీ చేశారు. వచ్చే ఏడాదికి మరో రెండు వచ్చే అవకాశం ఉంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడింది. అణు ఇంధనానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందానికి రష్యా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో ఐదు అణు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ ఒప్పందం జరిగితే ఆ ప్లాంట్లు ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
ALSO READ: సీఆర్ఫీఎఫ్ జవాన్లకు ఎదురుదెబ్బ.. ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు మృతి
దీనికితోడు Su-57 ఐదో తరం యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఆయిల్ కొనుగోలు వ్యవహారం ఇరుదేశాల మధ్య చర్చకు రానుంది. కేవలం రష్యా వద్ద ఆయిల్ కొనుగోలు కారణంగా భారత్ పై 25 శాతం అదనపు సుంకాలను విధించింది అమెరికా. ఇప్పుడు దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మోదీ-పుతిన్ సమావేశాన్ని రెండు దేశాలు మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. పుతిన్ రావడానికి ముందు రష్యా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసుకు చెందిన దాదాపు 50 మంది అత్యున్నత స్థాయి కమాండోలు ఢిల్లీకి చేరుకున్నారు. అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు.
పుతిన్ కాన్వాయ్ వెళ్ళే ప్రతి మార్గాన్ని ఢిల్లీ పోలీసులు- ఎన్ఎస్జీ సిబ్బందితో కలిసి అణువణవునా జల్లెడ పడుతున్నారు. అంతేకాకుండా కాన్వాయ్ పై నిరంతర నిఘా కోసం ఏకంగా డ్రోన్ కార్యాలయం తెరిచారు కూడా. పుతిన్ వెళ్లే మార్గాలను స్నైపర్లు డేగ కళ్లతో పరిశీలిస్తాయి. ఏఐ, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ప్రతీ అంగుళాన్ని స్పష్టంగా చూపనున్నాయి. చివరిసారి 2021లో పుతిన్ భారత్ వచ్చారు.