Rahul Vs Amit Shah: సీజేపీ జంతర్ మంతర్ ఆందోళన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ విషయం ఇప్పుడు ప్రధాని మోదీ నుంచి అమిత్ షా వైపు మళ్లింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జరిగిన ఘటనకు అమిత్ షాను జవాబుదారీగా నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదని తేల్చేశారు. అసలేం జరిగింది?
నీట్ పరీక్ష లీక్ వ్యవహారంపై బొద్దింక జనతా పార్టీ నిరసనను పోలీసులు చేపట్టిన అణచివేత చర్యపై నోరువిప్పారు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ. ఈ క్రమంలో హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటుకు అమిత్ షా గైర్హాజరు కావడం వెనుక మౌనం.. హింసకు ఆమోదం తెలపడమేనని తేల్చిచెప్పారు.
విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతూ తమ భవిష్యత్తు గురించి ప్రశ్నలు అడిగారని, దానికి ప్రతిస్పందనగా వారిపై పెల్లెట్ గన్లు, మేకులు దింపిన లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించారని అన్నారు. ఫలితంగా పోలీసుల చేతిలో యువతీ యువతులు గాయాలపాలయ్యారని ధ్వజమెత్తారు. చెప్పుకోలేని చోట్ల పోలీసులు కొట్టారని, మైనర్లకు ఎముకలు విరిగాయని గుర్తు చేశారు. దాదాపు 20 రోజులు గడిచినా అమిత్ షా దీనికి సమాధానం చెప్పడానికి పార్లమెంటుకు రాలేదని విమర్శించారు.
చర్చ కోసం ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానాన్ని తిరస్కరించారని, ఆయన దోషి అయినా అయి ఉండాలి లేదా అసమర్థుడైనా అయి ఉండాలన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని మేం డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయంలో అమిత్ షాను జవాబుదారీగా నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
ALSO READ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గురూ.. 389 జాబ్స్, వెంటనే అప్లై చేయండి?
మొదటిది అమిత్ షా విద్యార్థులపై దాడి చేయాలని పోలీసులకు అధికారం ఇచ్చారని ఆరోపించారు. అలా అయితే అతను దోషి అవుతారని తేల్చిచెప్పారు. ఇక రెండోది.. ఇంత జరుగుతున్నా ఏమాత్రం తెలియదంటే, అతను పూర్తిగా అసమర్థులని అన్నారు. ఏది ఏకమైనప్పటికీ హోం మంత్రిగా, ఆ రోజు జరిగిన ఘటనకు ఆయనే బాధ్యుడని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.