Rahul Gandhi: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో ప్రస్తుతం దేశం రెండు ఇండియాలుగా మారిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకటి బిలియనీర్ల ఇండియా, రెండోది పేదల ఇండియా అని అన్నారు. ప్రస్తుతం దేశ సంపద అంతా కొద్ది మంది చేతుల్లో ఉండడంతో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేరళలోని కొట్టాయంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశంలో 73 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద ఉందో.. దేశంలో ఉన్న కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో ఉందన్నారు. దీనంతటికీ కారణం బీజేపీనేనని రాహుల్ గాంధీ విమర్శించారు.
దేశ సంపద కేవలం కొద్ది మంది చేతుల్లోనే కేద్రీకృతమై ఉంటే.. భారత్ సూపర్ పవర్ గా ఎలా దూసుకుపోతుంది అంటూ బీజేపీని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా ఉంటే.. సూపర్ పవర్ కావడం గురించి బీజేపీ నేతలు ఎలా మాట్లాడగలుగుతున్నారని అన్నారు.
దీంతో పాటుగా దేశ ప్రజలపై కాషాయం పార్టీ మరో కుట్రకు కూడా పాల్పడుతోందన్నారు. దేశ ప్రజలపై బలవంతంగా ఒకే చరిత్ర, ఒకే జాతి, ఒకే భాషను రుద్దడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. భారత వైవిద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుందని రాహుల్ గాంధీ ప్రజలకు మాటిచ్చారు.
Also Read: బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్.. బయటపెట్టిన ఈడీ..!
కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని భాషలను గౌరవిస్తుందన్నారు. ఒకవేళ బీజేపీ కేరళలో మళయాళాన్ని తొలగిస్తే.. రాష్ట్రంలోని మహిళలు తమ పిల్లలకు భరతమాత గొప్పదనాన్ని ఎలా వివరించగలుగుతారని ప్రశ్నించారు. అందుకే దేశంలో భిన్న భాషలు, సంస్కృతులు అవసరం అని రాహుల్ గాంధీ ప్రజలకు గుర్తు చేశారు. భాష, సంస్కృతుల పరంగా ప్రజల మధ్య చిచ్చు రేపి బీజేపీ లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.