Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వైశ్య సమాజం నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే వారి వ్యాపారాలు పతనం అంచుకు చేరాయని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 24న (మంగళవారం) ఢిల్లీలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలతో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహించారు. దీనికి సంబంధించిన 11 నిమిషాల వీడియోను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.
“మా వ్యాపారం పతనం అంచున ఉంది” అని సమావేశంలో ఓ వ్యాపారి అన్న మాటలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని రాహుల్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో చారిత్రక పాత్ర పోషించిన వైశ్య సమాజం నేడు ఇంతటి నిరాశలో ఉండటం దేశ ఆర్థిక పరిస్థితికి ప్రమాదకరమైన హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. సంక్లిష్టమైన జీఎస్టీ (GST) నిబంధనలు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్లాక్ అవ్వడం, పెరిగిన ముడి సరుకుల ధరలు చిరు వ్యాపారుల నడ్డి విరుస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం కేవలం అదానీ, రిలయన్స్ వంటి బడా కార్పొరేట్ సంస్థలకు, గుత్తాధిపత్య శక్తులకు మాత్రమే కొమ్ము కాస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు. వారికి స్వేచ్ఛా వాణిజ్యాన్ని కల్పిస్తూ.. దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (MSMEs) మాత్రం అధికారస్వామ్యం, తప్పుడు విధానాలతో బంధించిందని విమర్శించారు. ఇది కేవలం విధానపరమైన లోపం కాదని, దేశ ఉత్పత్తి, ఉపాధి, భారతదేశ భవిష్యత్తుపై జరుగుతున్న “ప్రత్యక్ష దాడి” అని అభివర్ణించారు. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశంలో సుమారు 18 లక్షల MSMEలు మూతపడ్డాయన్న నివేదికలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
డిసెంబర్ 23న బెర్లిన్లో జరిగిన ప్రసంగంలో కూడా రాహుల్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుత జీఎస్టీ విధానం “ప్రొడ్యూసర్ వ్యతిరేక, వినియోగదారు అనుకూల” విధానమని విశ్లేషించారు. దేశీయ ఉత్పత్తుల కంటే విదేశీ దిగుమతులకే ఈ విధానాలు మేలు చేస్తున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జీఎస్టీ స్లాబ్లను సరళీకరించి, స్థానిక తయారీ రంగానికి ఊతమిస్తామని హామీ ఇచ్చారు.
సాంప్రదాయకంగా బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న వైశ్య సమాజం ఇప్పుడు ప్రభుత్వ “భూస్వామ్య ఆలోచనల” వల్ల నష్టపోతోందని రాహుల్ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో దేశ వాణిజ్యానికి వెన్నెముక అయిన వైశ్య సమాజానికి తాను అండగా నిలుస్తానని, వారి కోసం పోరాటం చేస్తానని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.
"हमारा व्यापार खत्म होने की कगार पर है” – व्यापार संवाद में वैश्य समाज की इस पीड़ा ने सच में झकझोर कर रख दिया।
जिस समाज ने देश की अर्थव्यवस्था में ऐतिहासिक योगदान दिया, आज वही हताश है – ये खतरे की घंटी है।
सरकार ने Monopoly को खुली छूट दे दी है, और छोटे-मध्यम व्यापारियों को… pic.twitter.com/p3V950dCus
— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2025