Rahul Gandhi: లోక్సభలో ఎల్పీజీ కొరతపై జరిగిన చర్చ సందర్భంగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ఇంధన భద్రతపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. రష్యా నుండి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా వంటి ఇతర దేశాల అనుమతి మనకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. భారత్ వంటి సార్వభౌమ దేశం తన చమురు సంబంధాలను స్వయంగా నిర్ణయించుకోవాలే తప్ప పరాయి దేశాల ఒత్తిడికి తలొగ్గడం ఏంటని నిలదీశారు. దేశ ఆర్థిక భద్రతను కేంద్రం పక్కన పెట్టిందని ఆరోపిస్తూ సభలో కీలక పత్రాలను ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తావనను తీసుకువస్తూ రాహుల్ చేసిన విమర్శలపై అధికార పక్షం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ భద్రత ఇంధన భద్రత గురించి మాట్లాడుతుంటే ఇలాంటి అసందర్భ విషయాలను తీసుకురావడం తగదని మంత్రులు ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలు సభా మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ఆరోపణలను తిప్పికొడుతూ హర్దీప్ సింగ్ పురి దేశంలో ఇంధన పరిస్థితులపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు లోనవకుండా దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ఎల్పీజీ కొరతను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచాలని ఇప్పటికే చమురు కంపెనీలను ఆదేశించినట్లు సభకు తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
పేద ప్రజల అవసరాల కోసం పీడీఎస్ (PDS) ద్వారా కిరోసిన్ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. దేశ ఇంధన అవసరాల కోసం ఏ దేశంపైనా ఆధారపడాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడకుండా చూస్తామని హర్దీప్ సింగ్ పురి హామీ ఇచ్చారు. ఉభయ పక్షాల మధ్య వాగ్వాదంతో లోక్సభ దద్దరిల్లింది.
Read Also: 90 శాతం హోటళ్లు మూతపడే ప్రమాదం.. గ్యాస్ సంక్షోభంపై కేంద్రానికి కేటీఆర్ లేఖ