Sabarimala: శబరిమల కొండకు అయ్యప్పస్వాములు పోటెత్తారు. మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఒకేసారి దర్శనానికి తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. మొదటి మూడు రోజుల్లోనే దాదాపు మూడు లక్షలకు పైగా భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. పంబ నుంచి సన్నిధానం వరకు0 విపరీతమైన రద్దీ నెలకొంది. అయ్యప్పస్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భక్తులు భారీగా తరలిరావడంతో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సిబ్బంది, పోలీసులు నియంత్రించలేకోపోతున్నారు. శబరిమలలో భక్తుల రద్దీని నియంత్రించలేకపోవడంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, రద్దీ నిర్వహణ, భద్రత వంటి కీలక అంశాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టును బోర్డును ఆదేశించింది.
శబరిమలలో భక్తులు రద్దీని దేవస్వం బోర్డు నియంత్రించలేకకపోవడంతో కేరళ హైకోర్టు రోజుకు యాత్రికుల సంఖ్యను 75 వేలకు పరిమితం చేసింది. యాత్రికుల రద్దీ లక్షకు పైగా వచ్చినప్పుడు రెడ్ జోన్ లోకి ప్రవేశించిందని, ఇది ప్రజల భద్రతకు ప్రమాదాన్ని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సీజన్ నవంబర్ 16న ప్రారంభం కాగా వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 మంది భక్తులను, స్పాట్ బుకింగ్ ద్వారా మరో 20,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించేందుకు నిర్ణయించారు. గత మూడు రోజుల్లో దాదాపు లక్ష మంది భక్తులు సన్నిధానానికి తరలివచ్చారు. దీంతో వర్చువల్ క్యూ బుకింగ్ను 70 వేలకు, స్పాట్ బుకింగ్ను 5 వేలకు పరిమితం హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 24 వరకు ఇది అమలులో ఉంటుంది.
అటవీ మార్గంలో నడిచి వచ్చే యాత్రికులకు ప్రత్యేక పాసులు ఇవ్వనున్నారు. యాత్రికులు అటవీ శాఖ నుంచి పాస్లు పొందాల్సి ఉంటుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు సైతం పాసుల విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రద్దీని తగ్గించడానికి బుకింగ్ల కోసం నీలక్కల్ వద్ద ఏడు అదనపు బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంబ వద్ద ఒకటి ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పాస్లను 10 వేలకు పెంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. సన్నిధానం వద్ద క్యూ లైన్ క్లియర్ అయిన తర్వాతే యాత్రికులను అనుమతిస్తున్నారు.
శబరిమలకు వెళ్లే భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆరోగ్య సూచనలు చేసింది. అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలో బ్రెయిన్ ఫీవర్ కేసులు ఉన్నందున భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరింది. పంబ నదిలో స్నానం చేసేటప్పుడు నీళ్లు చెవులు, ముక్కులోకి పోకుండా చూసుకోవాలని సూచించింది. వేడి నీళ్లనే తాగాలని తెలిపింది. అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ 04735203232 ను సంప్రదించాలని కోరింది. భక్తులు ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించింది. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడంతో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.