Telangana Police: సాధారణంగా సినిమా హీరోలకో, రాజకీయ నాయకులకో వారి అభిమానులు పాలాభిషేకాలు చేయడం మనం చూస్తుంటాం. కానీ, ఒక పోలీస్ అధికారికి, బాధితులు కృతజ్ఞతతో పాలాభిషేకం చేయడం అరుదైన దృశ్యం. మహబూబాబాద్ జిల్లాలో అటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ శబరీష్ పనితీరుకు, ఆయన అందించిన న్యాయానికి ముగ్ధులైన ఓ కుటుంబం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంది. “జయహో పోలీస్” అంటూ నినదించింది.
కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన తాజ్ నోజ్ సులోచన అనే మహిళ తన పాత ఇంటి స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని అనుమతులను ఆమె పొందారు. అయితే, ఇంటి నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి ఆమెకు స్థానిక భూ కబ్జాదారుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమెకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నప్పటికీ, కొందరు వ్యక్తులు నిర్మాణం జరగకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆమెపై పలుమార్లు భౌతిక దాడులకు కూడా దిగారు. దీంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. స్థానికంగా న్యాయం జరగకపోవడంతో, తన వద్ద ఉన్న అన్ని పత్రాలను తీసుకొని నేరుగా జిల్లా ఎస్పీ శబరీష్ను ఆశ్రయించింది.
బాధితురాలి ఆవేదనను సావధానంగా విన్న ఎస్పీ శబరీష్, ఆమె సమర్పించిన పత్రాలను పరిశీలించారు. ఆమెకు న్యాయం జరగాలని భావించి, వెంటనే చర్యలకు ఆదేశించారు. భూ ఆక్రమణదారులు, దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. సులోచన ఇంటి నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీసులు భద్రత కల్పించారు. దీంతో ఆమె తన ఇంటి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగారు.
తాను కలలు కన్న ఇంటిని నిర్మించుకోవడంలో సహకరించిన పోలీసుల రుణం తీర్చుకోలేనిదని సులోచన కుటుంబం భావించింది. తమకు అండగా నిలిచిన ఎస్పీ శబరీష్పై కృతజ్ఞత భావాన్ని వినూత్నంగా చాటుకుంది. కుటుంబ సమేతంగా ఎస్పీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆక్రమణదారుల నుంచి తమను కాపాడి, ఇంటి నిర్మాణానికి సహకరించినందుకు ఎస్పీకి పాదాభివందనం చేస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. సామాన్యులకు అండగా నిలిచే ఇలాంటి అధికారులే సమాజానికి అవసరమని స్థానికులు కొనియాడుతున్నారు.