Sharad Pawar Serious On PM Modi(Political news telugu): ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ నేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహా వికాస్ అఘాడీ అభ్యర్థికి మద్దతుగా అమరావతి ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. మాజీ ప్రధానులు కొత్త భారతదేశం కోసం పనిచేశారని, అయితే, ప్రధాని మోదీ మాత్రం ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని.. గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో చెప్పలేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలే తప్ప ఇతరులపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
అయితే, అమరావతి లోక్ సభ నియోజకవర్గం స్థానంలో కాంగ్రెస్ కు చెందిన బల్వంత్ వాంఖడేపై 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణాను బీజేపీ పోటీకి దింపింది. 2019 ఎన్నికల్లో నవనీత్ రాణాకి మద్దతు ఇచ్చి తాను తప్పు చేశానని, అందుకే అమరావతి ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చానంటూ పవార్ అన్నారు.
ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నరసింహారావు నుంచి మన్మోహన్ సింగ్ వరకు దాదాపు అందరు ప్రధానుల పని తీరును తాను చూశానని.. వారి ప్రయత్నాలు నవ భారతదేశాన్ని రూపొందించడంలో కీలకంగా ఉన్నాయన్నారు. కానీ, ప్రస్తుత ప్రధాని కేవలం విమర్శలు మాత్రమే చేస్తున్నారని పవార్ ఆరోపించారు.
Also Read:చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు: భావోద్వేగంతో తేజస్వీ
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషిని చరిత్రలో ఎవరూ మరిచిపోలేరని, కానీ.. ప్రధాని మోదీ మాత్రం ఆయనను నిరంతరం విమర్శిస్తున్నారని పవార్ అన్నారు. భారతదేశంలో నిరంకుశ పాలనను అనుమతించవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(యుబిటి) గతంలో మాదిరిగానే కాంగ్రెస్ మరియు ఎన్సీపీ తో కలిసి పనిచేయడం ద్వారా జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యతను భుజాన వేసుకుందంటూ పవార్ ప్రశంసించారు.