Nepal Floods: నేపాల్ లో అకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకూ 46 మంది ప్రాణాలు కోల్పోగా.. 400 మంది అదృశ్యమయ్యారు. గల్లంతైన వారిలో 105 భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం.. సద్గురు ఈషా ఫౌండేషన్కు చెందిన దాదాపు 77 మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుని గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో చైనాలోని టిబెట్ ప్రాంతానికి చెందిన గైరోంగ్ వద్ద వీరంతా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద యాత్రికులు వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా భయంకరమైన వరద ముంచెత్తింది. వరద నీటి ఉధృతికి ఇమ్మిగ్రేషన్ భవనంతో పాటు ఆ పట్టణంలోని చాలా భాగం పూర్తిగా నీట మునిగిపోయింది.
ఈ విషాదకర సంఘటనపై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్ వద్ద ఉన్న భక్తుల ఆచూకీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం తమకు అందలేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న తమ స్వచ్ఛంద కార్యకర్తలు, సహాయక బృందాలు బాధితులను కాపాడేందుకు శాయశక్తులా యత్నిస్తున్నాయని అన్నారు. ఎంతటి ప్రమాదానికైనా వెనకాడకుండా అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Also Read: వరుడికి సోదరిగా మారి.. వధువుకు తాళి కట్టిన కవిత.. కీసర పెళ్లిలో ఆసక్తికర ఘటన!
నేపాల్ లోని మానససరోవం యాత్రకు ఈషా ఫౌండేషన్ తర్వాత 21 బృందాలు వెళ్లినట్లు సద్గురు తెలిపారు. వీరిలో 495 మంది భక్తులు ఇప్పటికే సురక్షితంగా ఇళ్లకు చేరుకోగా.. మిగిలిన వారిలో 743 మంది ప్రస్తుతం టిబెట్లో ఉన్నారన్నారు. మరో 148 మంది నేపాల్లో ఉన్నట్లు చెప్పారు. నేపాల్లోని తిమురే ప్రాంతంలో ముగ్గురు వాలంటీర్లు సురక్షితంగా ఉండగా.. ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్న 77 మంది భక్తుల పరిస్థితిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్థానిక యంత్రాంగం సహాయంతో వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Also Read: పవన్ vs జగన్.. పులివెందుల దాహార్తి తీర్చిందెవరు? ఎవరి పాత్ర ఎంత?