US : అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి ఓ యువకుడు అలజడి రేపాడు. ట్రాఫిక్ బారియర్స్ను ఢీకొట్టాడు. వైట్హౌస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తెలుగు సంతతికి చెందిన సాయివర్షిత్ కందులగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
సాయి వర్షిత్ ఉద్దేశపూర్వకంగానే వైట్హౌస్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వైట్హౌస్ ఉత్తరభాగంవైపు నుంచి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఆ సమయంలో ట్రక్కును నాజీ జెండా కట్టి ఉన్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. అయితే అధ్యక్షుడు జోబైడెన్ తన టార్గెట్ అని చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటన జరిగిన వెంటనే వైట్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాలను లాక్డౌన్ చేశారు. సమీపంలోని హోటల్స్ను ఖాళీ చేయించి తనిఖీలు జరిపారు పోలీసులు. చుట్టుపక్కల పార్క్లను సైతం మూసేశారు. వ్యాన్లో కానీ.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎలాంటి మారణాయుధాలు.. అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలిపారు.
నిందితుడిపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు ప్రయత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేశారు .
అమెరికాలోని ఛెస్ట్ఫీల్డ్కు చెందిన సాయివర్షిత్ 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లుగా గుర్తించారు. అతడు ఎందుకు ఈ పని చేశాడు? దీని వెనుక ఉద్దేశాలు ఏంటని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.