UP News : ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రైమరీ పాఠశాలలో ప్రిన్సిపల్ కొట్టడంతో ఓ చిన్నారి కంటి చూపు కోల్పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. బడికి వెళ్లిన చిన్నారి కంటికి తీవ్ర గాయాలు అవ్వడంతో.. మొదట తీవ్ర వాపు కనిపించగా, తర్వాత ఆ చిన్నారు చూపు పూర్తిగా కోల్పోయింది. ఈ విషయమై అక్కడి విద్యాశాఖ అధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు.
బడికి వెళ్లిన కుతూరు ఆడుతూపాడుతూ ఇంటికి రావాల్సింది పోయి కంటికి దెబ్బ తగిలించుకుని వచ్చింది. తీవ్రమైన వాపుతో కన్ను కనిపించడం లేదని చెప్పింది. దీంతో.. ఆ చిన్నారి తల్లి గుండెలు గుభేలుమన్నాయి. అంతలోనే 7 ఏళ్ల చిన్నారికి శాశ్వత వైకల్యం రావడంతో తీవ్ర ఆవేదనకు గురవుతోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్లోని ఓ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఈ ఘటనకు తనకు సంబంధం లేదని ప్రిన్సిపల్ అంటుంటే.. ప్రిన్సిపల్ కారణంగా కన్ను పోయిందని చిన్నారి తల్లి ఆరోపిస్తోంది.
మొరాదాబాద్ లోని భోగ్పూర్ మిథోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 7 ఏళ్ల బాలిక హిమాన్షి కంటి గాయంతో ఇంటికి వచ్చింది. ఏమైందని అడిగిన తల్లికి.. తన కన్ను కనిపించడం లేదని చెప్పడంతో నిర్ఘాంతపోయింది. అప్పటికే.. కన్ను తీవ్రంగా వాచిపోయి ఉండడంతో పాఠశాలలో ఎవరో గాయపరిచారని గుర్తించింది. ఈ విషయమై చిన్నారి తల్లి జ్యోతి కశ్యప్.. పాఠశాల ప్రిన్సిపాల్ గీతా కరల్పై జిల్లా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. ఆమే తన కూతుర్ని గాయపరిచిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో.. కలెక్టర్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఆరోపణల్ని ప్రిన్సిపాల్ గీతా కరల్ ఖండించారు. హిమాన్షి తల్లి ఆరోపిస్తున్నట్లుగా తాను గాయపరచలేదని, ఆమెకు ముందు నుంచే కంటి చూపు సరిగా లేదని అంటున్నారు. ఆ ర రోజు కంటి వాపునకు బెనజీర్ అనే సహ విద్యార్థి మోచెయ్యి ప్రమాదవశాత్తూ హిమాన్షి ముఖానికి తాకడంతో అయిన గాయంగా చెబుతున్నారు. అంతే కానీ తాను కొట్టలేదని చెబుతున్నారు. చిన్నారి హిమాన్షి కంటి గాయంతో ఇంటికి చేరుకున్న సమయంలోనే… ఆమె తల్లి పాఠశాలకు వచ్చారు. తన కూతురు కంటికి గాయం అయ్యిందని ప్రిన్సిపాల్ నుంచి వైద్య ధృవీకరణ పత్రాన్ని కావాలని కోరారు. ఈ విషయమై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో.. పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారిందని అధికారులు అంటున్నారు. ఆ సమయంలో చిన్నారి తల్లి స్కూల్ ప్రిన్సిపాల్ ను బెదిరించారించిందని, ఆ వెంటనే ఈ ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.
Also Read : India Richest States : దేశంలోని టాప్ 10 ధనిక రాష్ట్రాలు ఇవే – తెలుగు రాష్ట్రాల స్థానమేంటంటే?
ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్.. తనకు వైద్య నివేదికను జారీ చేసే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. అలా కావాలంటే వైద్యశాలకు వెళ్లాలని సూచించినా, చిన్నారి తల్లి పట్టించుకోలేదని అంటున్నారు. కాగా.. ఈ విషయం పెద్దది అవుతుండడతో విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ రోజు బడిలో ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.