UPI Transactions : గతంలో ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేాయాలంటే డెబిట్, క్రెడిట్ కార్డులు తప్పనిసరి. లేదంటే బ్యాంకులకు వెళ్లాల్సిందే. కానీ.. యూపీఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిటికెలో పనైపోతుంది. చిన్నచిన్న పేమెంట్స్ నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీల వరకు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ కారణంగానే.. ఏటికేటా యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు యూపీఐ ద్వారా మొత్తంగా రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది. ఇది.. డిజిటల్ భారత్ సాధించిన విజయంగా చెప్పుకొచ్చింది.
భారత అవసరాల మేరకు ఇక్కడ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI)ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి వివిధ మొబైల్ యాప్ ల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. రోజు వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుండగా.. ఏటికేటా లావాదేవీలి సంఖ్య, విలువ పెరిగిపోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మొదట భారత్ లో మొదలైన ఈ యూపీఐ చెల్లింపుల విధానం సులువుగా, సురక్షితంగా ఉండడంతో ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సేవల్ని ఏడు దేశాలు.. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లలో వినియోగిస్తున్నారు. కాగా.. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ దేశాల సదస్సులోనూ ఈ సేవల్ని పరిచయం చేయడంతో పాటు ఆయా దేశాల్లో ఈ సేవల్ని కొనసాగించేందుకు వీలుగా కార్యచరణ ప్రారంభించారు. దీంతో.. రానున్న రోజుల్లో బ్రిక్స్ దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ యూపీఐ చెల్లింపుల విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
యూపీఐ సిస్టం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధుల బదిలీ, సమయం ఆదా అవడంతో పాటు వీధి వ్యాపారుల నుంచి బడా స్టోర్ల వరకు చెల్లింపులు చేయగలగడం, పీర్-టు-పీర్ లావాదేవీలు యూపీఐ ద్వారా వీలవుతోంది. అంతే కాక.. యూపీఐ ద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. 2024, అక్టోబర్లో యూపీఐ ద్వారా 1,658 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిర్వహించగా.. దీని ద్వారా రూ.23.49 లక్షల కోట్ల విలువ గల లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీలు గతేడాది అక్టోబర్ లో 11.40 బిలియన్ల లావాదేవీల నుంచి ఈ ఏడాది 16.58 బిలియన్ లావాదేవీలకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.
యూపీఐ ద్వారా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, వలస కార్మికులకు ప్రయోజం చేకూరిందని కేంద్రం చెబుతోంది. ఈ వర్గాల వారికి డబ్బులు బదిలీ చేయడం, చెల్లింపులు స్వీకరించడం సులభమైందని, వారు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించిందని తెలిపింది. కొవిడ్ – 19 సమయంలో.. ప్రజల నగదు లావాదేవీలుకు సురక్షితమైన మార్గంగా ఇది కనిపించిందని, కాంటాక్ట్ లెస్ లావాదేవీలకు వీలు కల్పించడంతో.. వేగంగా ప్రజల్లోకి వెళ్లిందని నిపుణులు చెబుతున్నారు.
Also Read :
ప్రస్తుతం దేశంలో 632 బ్యాంకులు యూపీఐ ప్లాట్ఫాంకు అనుసంధానంగా సేవల్ని అందిస్తున్నాయి. ఇటీవలే ఫ్రాన్స్లో కూడా యూపీఐ, రూపే కార్టుల సేవలు ప్రవేశించాయి. ఇది మొత్తం యూరప్ దేశాల్లో యూపీఐ వినియోగానికి మంచి పరిణామం అంటున్నారు.