Karnataka : కర్ణాటకలో సీఎం అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ వీడలేదు. మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ అంశం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంది. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలు.. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో సీఎంను ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. ఈ అంశంపై ఏకవాక్యంతో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్యే ప్రతిపాదించారు.
పార్టీ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ అగ్రనేతలకు, ప్రజలకు ధన్యావాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని డీకే శివకుమార్ ప్రతిపాదించారు. పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6.5 కోట్ల కన్నడ ప్రజలకు సేవలందిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు.
సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ నుంచి పరిశీలకులుగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ శిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బాబ్రియా వచ్చారు. కర్ణాటక వ్యవహారల బాధ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 135 మంది ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాన్ని సేకరించాలని భావించారు. ఎమ్మెల్యేలు ఎవరూ నిర్ణయాన్ని వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు.
ఇక అధిష్టానమే సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చాల్చి ఉంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు సోమవారం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీని కలిసే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం సిద్ధరామయ్యతో మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తో పరిశీలకులు తొలుత విడిగా సమావేశమయ్యారు. ఇక సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానమే తేల్చనుంది.