Biographical thriller Series : భారత ఆర్థిక వ్యవస్థలో ఒక సంఘటన పెను మార్పులకు కారణం అయింది. అది దేశం ఉలిక్కిపడిన ఒక స్టాక్ మార్కెట్ స్కామ్. 1980, 90వ దశకాల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఒక సిరీస్ కూడా తెరకెక్కింది. స్టాక్ మార్కెట్ ‘బిగ్ బుల్’గా పేరొందిన హర్షద్ మెహతా ఎదుగుదల, అతను చేసిన రూ. 5,000 కోట్ల కుంభకోణం, ఆపై అతని పతనాన్ని ఇందులో చూపించారు. అయితే 1990ల్లోనే హర్షద్ మెహతా లైఫ్ స్టైల్ చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ముంబైలో 15,000 చదరపు అడుగుల విలాసవంతమైన పెంటహౌస్లో ఉండేవాడు. అందులో మినీ గోల్ఫ్ కోర్స్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి. అలాగే ఆయన దగ్గర అప్పట్లోనే అత్యంత ఖరీదైన ‘లెక్సస్’ కారు ఉండేది. ఇక ఈ సిరీస్ కు ఐయండిబిలో 9.2 రేటింగ్ ఉండటం విశేషం.
ఈ బయోలాజికల్ ఫైనాన్షియల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘స్కామ్ 1992’ (Scam1992). 2020లో వచ్చిన ఈ సూపర్ హిట్ సిరీస్ కు హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్లో చూపించిన సుచేతా దలాల్ (జర్నలిస్ట్), కె. మాధవన్ (CBI ఆఫీసర్), అశ్విన్ మెహతా (హర్షద్ సోదరుడు) వంటి పాత్రలన్నీ నిజ జీవిత వ్యక్తులే. అప్పట్లో ఈ స్కామ్ను బయటపెట్టినందుకు సుచేతా దలాల్కు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఇందులో హర్షద్ మెహతా పాత్ర కోసం నటుడు ప్రతీక్ గాంధీ దాదాపు 18 కిలోల బరువు పెరిగారు. ఆయన నటన ఎంత సహజంగా ఉందంటే, ఇప్పటికీ చాలా మంది హర్షద్ మెహతా అంటే ప్రతీక్ గాంధీ ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఈ సిరీస్ థీమ్ మ్యూజిక్ ఎంత పాపులర్ అయిందంటే, సోషల్ మీడియాలో రీల్స్, రింగ్టోన్స్గా అది ఒక ట్రెండ్ సృష్టించింది. దీనిని కంపోజ్ చేసిన అచింత్ థక్కర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఈ సిరీస్ ప్రస్తుతం SonyLIV ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది. ఇది తెలుగు ఆడియోతో కూడా చూడటానికి వీలుగా ఉంది.
హర్షద్ మెహతా ఒక మామూలు మధ్యతరగతికి చెందిన గుజరాతీ వ్యక్తి. బొంబాయి స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టి తన తెలివితేటలతో ఎలా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడనేదే ఈ ‘స్కామ్ 1992’ కథ. మొదట్లో చిన్న జాబ్ చేస్తూ మార్కెట్ మెళకువలు నేర్చుకున్న హర్షద్, ఆ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్లో ఉన్న లోపాలను పట్టుకుంటాడు. తప్పుడు బ్యాంక్ రశీదు సాయంతో బ్యాంకుల నుండి వేల కోట్లు బయటకు తీసి, ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో కుమ్మరించి షేర్ల ధరలను ఆకాశానికి తీసుకెళ్తాడు. దాంతో ఒక్కసారిగా దేశం మొత్తం అతని వైపు చూసేలా ‘బిగ్ బుల్’గా అవతరిస్తాడు. అయితే ఈ ఎదుగుదల వెనుక ఉన్న అసలు రంగును జర్నలిస్ట్ సుచేతా దలాల్ బయటపెడుతుంది. హర్షద్ చేస్తున్న ఈ మనీ సర్క్యులేషన్ ఆట బయటపడటంతో ఒక్కసారిగా బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుంది. సీబీఐ రంగంలోకి దిగడం, హర్షద్ ఆస్తులన్నీ జప్తు అవ్వడం, చివరకు జైలు పాలవ్వడం వంటి నాటకీయ పరిణామాలతో ఈ సిరీస్ సాగుతుంది. ఒక సామాన్యుడు సిస్టమ్ను ఎలా వాడుకున్నాడు, ఆ సిస్టమే అతన్ని ఎలా తొక్కేసింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు ఇందులో. అప్పటివరకు స్టాక్ మార్కెట్పై సరైన నియంత్రణ ఉండేది కాదు. కానీ ఈ స్కామ్ తరువాత సెబీ నియంత్రణలో స్టాక్ మార్కెట్ వ్యవహారాలు జరుగుతున్నాయి.
Read Also : గుండెల్లో వణుకు పుట్టించే సముద్రపు దొంగలు… వన్ పీస్ ను మించిన అడ్వెంచర్