ఆమె వివాదాలకు కేంద్ర బిందువు. మంత్రిగా ఉన్నా.. చాలా సందర్భాల్లో ఆమె మాట్లాడే మాటలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. తాజాగా ఆమె మళ్లీ వార్తల్లోకెక్కారు. నగరానికి మోడీ రాక నేపథ్యంలో.. ఏదో మాట్లాడదామని, మరేదో విమర్శిద్దామని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి తెర తీశాయి. మోడీ వస్తాడు… జై శ్రీరామ్ అంటాడు..! ఆ నినాదమేమన్నా పై నుంచి పైసలు ఇస్తుందా? అని కొంచెం హద్దు మీరి చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు బండి సంజయ్ బుస్సున లేచాడు. ఓ ప్రెస్నోట్ రిలీజ్ చేసేశాడు. దీంతో వివాదం రచ్చకెక్కింది. నిజానికి, ఆమె చాలా విషయాలు మాట్లాడారు.
కేంద్రం నుంచి నిధుల విషయంలో బీజేపీ మంత్రులను నిలదీశారు. కానీ అవేవీ ఇప్పుడు లెక్కలోకి రాలేదు. ఆమె చేసిన జై శ్రీరామ్ వ్యాఖ్యలే వివాదమయ్యాయి. కొండా సురేఖకు ఇది కొత్త కాదు. కానీ ఆమె కొంతకాలంగా ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. గతంలో జరిగిన ఉదంతాల నేపథ్యంలో అధిష్టానం మందలించడంతో కొంచెం వెనక్కి తగ్గి కనిపించారు. ఇప్పుడు మళ్లీ ఆమె తన సహజ శైలిలో విజృంభించారు. సర్కార్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారు. బీసీ మహిళా మంత్రిగా ఆమెకు సర్కార్ సముచిత ప్రాధాన్యమిచ్చింది.
గతంలో.. సినీ హీరో నాగార్జున కుటుంబ వ్యవహారంలో ఆమె చేసిన దురుసు వ్యాఖ్యలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఏకంగా నాగార్జున కొండా సురేఖను కోర్టుకీడ్చేదాకా వెళ్లింది వ్యవహారం. ఆమె ఏ మేర అదుపు తప్పి మాట్లాడుతారో ఆ ఉదంతం పట్టించింది. దీన్ని కవర్ చేసేందుకు.. నష్ట నివారణకు అధిష్టానం నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇది సద్దుమణగకు ముందే.. కూతురుతో వీడియో కాల్లో మాట్లాడిన మాటలు కొన్ని లీక్ కావడం.. వైరల్ కావడం.. ఆమె వివాదస్పద ప్రవర్తన తీరును పట్టించింది. ఇది చాలదంటు.. కొండా కూతురు కూడా రంగ ప్రవేశం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన ఓ అధికారిని సర్కార్ సస్పెండ్ చేసినందుకు…అతన్ని అరెస్టు చేసేందుకు ఇంటికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏకంగా సర్కార్నే ఇరకాటంలో పెట్టేలా దూషణలు చేశారు. దీన్ని అధిష్టానం మరింత సీరియస్గా తీసుకున్నది.
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను రంగంలోకి దింపి మందలించారు. మంత్రి వర్గ విస్తరణలో ఆమె పేరు గాయబ్ అవుతుందని అంతా భావించారు. కానీ రేవంత్ కనికరించారు. బీసీ మహిళా మంత్రి కావడం కూడా ఆమెకు ప్లస్ అయ్యింది. కానీ ఆమె తీరు మార్చుకోలేదని తాజా ఉదంతంతో నిరూపితమైంది. కేటీఆర్ కూడా ఆ మధ్య ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. జై శ్రీరామ్ అంటే… ఉద్యోగాలొస్తాయా? కడుపులు నిండుతాయా? అని మాట్లాడారు. దీన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకున్నది. హిందూ భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన విషయం కావడంతో ఇది జనాలకు తొందరగా చేరుతున్నది. వారు ఈ విషయంలో రెస్పాండ్ అయ్యే తీరు కూడా అలాగే ఉంటుంది. దీంతో కేటీఆర్ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం మానుకున్నారు. ఇప్పుడు కొండా వంతు వచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలతో మీడియాలో వైరల్ కావొచ్చేమో గానీ.. సర్కార్కు మైలేజీ తెచ్చిన వారైతే కచ్చితంగా కారు. మళ్లీ సర్కార్ తలపట్టుకోవాల్సి వచ్చింది….