రెండున్నరేండ్లలో ఓ ఐదు సార్లే కేసీఆర్ బయటకు వచ్చాడంట.. ! ఈ విషయం కేటీఆరే స్వయంగా వెల్లడించాడు. అంటే ఆయన సరాసరిగా ఆరు నెలలకోసారి అధికారికంగా బయటకు వచ్చి అలా ప్రజలను పలకరించి పోతున్నాడన్నమాట. సర్కార్ను నిలదీస్తూ వెళ్లిపోతున్నాడన్నమాట. ఈ లెక్కన ఆయన మరో ఐదు సార్లు వస్తాడని అనుకోవడానికి లేదు.
చివరి ఏడాది ఎన్నికల సమయం కదా.. అప్పుడు హెలికాప్టర్ వేసుకుని గాలి తిరుగుళ్ల ప్రచారం చేస్తాడు.. అది వేరే విషయం. ఇప్పుడు డిస్కషన్ అది కాదు. ఇన్నేండ్లుగా కేసీఆర్ను తిట్టిన తిట్టు తిట్టకుండా రేవంత్ తిడుతూనే ఉన్నాడు. కానీ ఏనాడూ కేసీఆర్ దీనికి కౌంటర్ ఇవ్వలేదు. కానీ తన చావును కోరుకుంటున్నాడు రేవంతు .. అని అన్నాడు. ఇది కూడా పరోక్షంగా. లేక లేక ఆ ఒక్క మాటన్నా.. అది బలంగానే తాకింది కాంగ్రెస్ కు. జనాలకు కూడా బాగానే రీచ్ అయ్యింది.
అప్పట్నుంచి ఆయన బయటకు రావడం లేదు. రేవంత్ ఎన్ని మాటలన్నా పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు కేసీఆర్. రేవంత్ రెచ్చగొట్టే మాటలకు.. కేటీఆర్, హరీశ్రావును కౌంటర్లిస్తున్నా.. ఇవంత ఘటుగా ఏం ఉండటం లేదు. కేసీఆర్ కేసీయారే. ఆయన మాటలకున్న పవర్ అది. మాట్లాడే తీరే అంతా. జనాన్ని ఆకట్టుకుని ఎలా వారికి కనెక్టవ్వాలో తెలిసిన నేత. అందుకే రేవంత్ .. కేసీఆర్ను ఎన్ని తిట్లు తిట్టినా.. అవి తిట్లు గానే కేసీఆర్ ఖాతాలో ఉండిపోతన్నాయి గానీ, వీటి బద్లా తీర్చుకునే విషయంలో బావబామ్మర్దులిద్దరూ విఫలమయ్యారు.
జనం కేసీఆర్ మాటలే వినాలనుకుంటున్నారు. రేవంత్ కూడా కేసీఆర్ మౌనాన్ని భగ్నం చేయాలనుకుంటున్నాడు. కేసీఆర్ మౌనం వీడటం లేదు. రేవంత్ తిట్ల దండకం చదవడమూ ఆపడము లేదు. రెచ్చగొట్టడమూ మానలేదు. కానీ ఇంతలా మౌనమునిగా ఉన్న కేసీఆర్ లోలోన బాగానే రలిగిపోతున్నాడు. ఎందుకంటే… ఆయన తెలంగాణ జాతిపితగా కీర్తింపబడాలని కోరుకున్నాడు. కానీ ఇప్పుడు దీన్ని రేవంత్ రివర్స్ చేసి చూపేలా మాట్లాడుతున్నాడు.
జనం ఏం అనుకుంటున్నారో పక్కన బెడితే.. ఇదో రాజకీయ వ్యూహమని రేవంత్.. నువ్వెన్ని తిట్టినా నీ మాటలకు బదులిచ్చేదే లేదు.. సమయం వచ్చినప్పుడు ఏం చెప్పాలో అది చెబుతా అని కేసీఆర్ తనదైన వ్యూహంగా అమలు చేస్తూ వస్తున్నాడు. కానీ కేసీఆర్ నుంచి ఎలాంటి పలుకులు రాకపోవడమేది బీఆరెస్కు ప్లస్గానే చూడాల్సి వస్తుంది. ఇప్పుడే స్పందించి నోరు ఖాళీ చేసుకోవాలని కేసీఆర్ అనుకోవడం లేదు.
తన తిట్లకు, మాటలకు, విమర్శలకు, నిలదీతలకు ఓ విలువుందని కేసీఆర్ భావిస్తున్నాడు. అందులో నిజం కూడా లేకపోలేదు. అందుకే అనువుగాని చోట అధికులమనరాదు.. కొండ అద్దమందు కొంచెమై ఉండదా? అనే సామెతను ఫాలో అవుతున్నాడు. కానీ లోలోల బాగానే రగిలిపోతున్నాడు. రేవంత్ కూడా రగిలిపోతున్నాడు.. ఇంతలా రెచ్చగొట్టే మాటలన్నా.. ఇంకా కేసీఆర్లో చలనం లేకపోవడాన్ని చూసి.