Delhi: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని టీడీపీకి చెందిన పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను పరిటాల సునీత ఎక్స్లో పోస్టు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సీఎం రేవంత్రెడ్డితో ఏపీ రాజకీయ మహిళా నేతలు
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పార్టీకి చెందిన మహిళా నేతలు హస్తినకు వెళ్లారు. ముఖ్యంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, ఆపై సవరణ జరగనుంది. ఈ క్రమంలో ముందుగానే టీడీపీకి చెందిన మహిళా నేతలు, ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. అక్కడే మహిళా ఎంపీలు కూడా ఉన్నారు.
ప్రత్యేక సమావేశాల కోసం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అక్కడే ఉన్నారు. అదే సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో సీఎం రేవంత్రెడ్డితో ఏపీ టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో గిరగిరా తిరిగేస్తున్నాయి.
మొన్న రోజా.. నిన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు
ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రధాన భాగస్వామి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తోంది. భిన్న రాజకీయ ధ్రువాలకు చెందిన నేతలు కలవడంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఫైర్ బ్రాండ్గా రేవంత్రెడ్డి కొనసాగిన నేపథ్యంలో పాత పరిచయాల కారణంగా ఈ భేటీ జరిగిందని అంటున్నారు.
కేవలం టీడీపీ మహిళా నేతలు మాత్రమేకాదు రీసెంట్ వైసీపీ ఫైర్బ్రాండ్, మాజీ మంత్రి రోజా కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ని కలిశారు. ఈ నేపథ్యంలో తెర వెనుక ఏదో జరుగుతోందని అనే చర్చ లేకపోలేదు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ భేటీలపై ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ALSO READ: నవ్వుతూ.. వెక్కిరిస్తూ… ! ప్రియాంక ప్రసంగానికి పార్లమెంటు ఫిదా…