కేసీఆర్ ఓ టైపైతే.. ఇప్పుడు రేవంత్ కేబినెట్ మరోటైపు. ఆయన ఏ ఏడాది పాటు మంత్రివర్గ విస్తరణే చేయలేదు రెండో టర్ములో. హరీశ్రావుకు చెక్పెట్టేందుకు. మహిళా మంత్రి లేకుండా సాగించేశాడు మరో టర్ము. ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలనలో సగం టర్ము ముగిసినా.. ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. ఆశావహులను ఊరిస్తూ.. ఊరిస్తూ.. కోటగాడు కోడిని వేలాడిదీసి ఉట్టి అన్నం తిన్నట్టుగా.. ఢిల్లీ అధిష్టానం రేపు మాపు అంటూ ఆశలు పెడుతున్నది.
బీసీ కార్డు ప్రయోగించినా.. రెడ్లకు మాత్రం ఆశ వదల్లేదు. నాక్కావాలంటే నాక్కావాలని ఇంకా ఇద్దరు రెడ్లు రెడీగా ఉన్నారు. మహేశ్ కూడా తనకు డిప్యూటీ సీఎం ఇస్తారేమో బీసీ కోటాలో అని ఎదురుచూస్తున్నాడు. దాన్నిదక్కించుకుని.. చలి అన్నం తింటా.. ఉడుకుది అయ్యేదాకా ఉంటా.. అని ఎగిర్తపు చుట్టం అన్నట్టుగా మహేశ్ డిప్యూటీ సీఎం అయితే.. బీసీ సీఎంకు దారి దగ్గరపడ్డట్టే కదా! అని సమాలోచనలు చేస్తూ వస్తున్నాడట.
అప్పటి వరకు పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. ఈ విషయంలో కొత్త రికార్డు సృష్టించాడు రేవంత్. పూర్తి స్థాయి కేబినెట్ లేకుండానే.. సగం పాలన కంప్లీట్ చేశాడు. ఆ మూడు బెర్తులు కూడా ఇప్పట్లో భర్తీ చేసేలా కనిపించడం లేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, ఇబ్రహీంపట్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. రేవంత్ పక్కలో బల్లెళ్లా మారారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే.. అవకాశం దొరికినప్పుడల్లా సర్కార్పై విరుచుకుపడుతున్నారు.
మరో వైపు హోంమంత్రి పదవి కూడా సీఎం దగ్గరే పెట్టుకోవడం కూడా వివాదమై కూర్చుంది. రాష్ట్రంలో పోక్సో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. బండి సంజయ్ కొడుకు ఉదంతం సర్కార్కు ఓ మచ్చను మిగిల్చింది. మొన్నటి షాబాద్ ఆరుగురిని హత్య చేసిన రాజ్కుమార్ కేసు కూడా పొరుగు రాష్ట్రం దగ్గర పలుచనయ్యేలా చేసింది. మొత్తానికి పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది.. దీనికి కారణం హోంమంత్రి లేకపోవడం.. సీఎం బిజీగా ఉండి.. హోం బాధ్యతలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
ఇక మున్సిపల్ శాఖ, విద్యాశాఖ కూడా సీఎం దగ్గరే పెట్టుకున్నాడు. విద్యాశాఖ మీద కూడా అసంతృప్తి ఉంది. మున్సిపల్ శాఖ విషయంలో సర్కార్ ఇంకా పూర్తి స్థాయి పట్టు సాధించలేదు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోవడం లేదు. ఇంకా సమయం తీసుకుంటున్నది. ఎన్ని రోజులు ఎక్కువ సమయం తీసుకుంటే అంతగా బీజేపీ, బీఆరెస్ పార్టీలు లాభపడతాయే తప్ప.. కాంగ్రెస్ పుంజుకోవడం కష్టం.
మరి ఇంత డ్యామేజీ అవుతున్నా.. ఇటు రేవంత్ ఢిల్లీ పెద్దలకు చెప్పి ఒప్పించడంలో విఫలమవుతుండగా… రాహుల్ గాంధీ కూడా తెలంగాణను లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. మరోసారి వస్తుందా? రాదా? అనుమానం బలంగా మారుతోంది కాబోలు.. అని అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలే.