బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పిస్తారు! ఇదిప్పుడు వైరల్ అవుతున్న అంశం. కొడుకు కేసు నేపథ్యంలో రాజకీయాల్లో ఇప్పుడీ అంశం హట్ టాపిక్గా మారింది. కానీ ఇదిప్పటి ముచ్చట కాదు. గత కొంత కాలంగా బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పించాలని అధిష్టానం భావిస్తోంది. దీనికి బదులుగా మళ్లీ అతన్ని మళ్లీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి.. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోవాలని భావించింది. అప్పుడు బీఆరెస్, బీజేపీలకు మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాలు, రాజకీయ అవసరాల నేపథ్యంలో కేసీఆర్ మాట విని అమిత్ షా… బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.
కిషన్రెడ్డిని తాత్కాలిక అధ్యక్షుడిని చేసినా, రాంచంద్రారావుకు పార్టీ పగ్గాలు అప్పగించినా.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రాకపోగా.. అధిష్టానం నిర్ణయం పట్ల పెదవి విరిచారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈసారి బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని కృత నిశ్చయంతో ఉంది. పశ్చిమ బెంగాల్లో వచ్చిన అనూహ్య ఫలితాల తరువాత తెలంగాణ బీజేపీలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. అధిష్టానం కూడా తెలంగాణపై సీరియస్ నజర్ వేసింది. ఈ క్రమంలో బండి సంజయ్కి.. బీజేపీ రాష్ట్ర పగ్గాలివ్వాలని భావించింది.
కానీ అంతకు ముందు అనుకున్నట్టుగా.. రాష్ట్ర పగ్గాలిచ్చే విషయంలోనూ కేంద్రం వెనుకాముందాడుతుంది. బండికి ఎవరు కాదన్నా ఔనన్నా మాస్ అప్పీయరెన్స్ ఉంది. తాజాగా మోడీ హైదరాబాద్ బహిరంగ సభా వేదికగా ఆయన ప్రసంగం మొదలు కాకముందే .. మైక్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా సభ కేరింతలతో అదిరిపోయింది.
ఈలలు, నినాదాలతో మార్మోగింది. వారిని సముదాయించి, వారించే వరకు పోయింది పరిస్థితి. మోడీ సభకు బండికి ఇన్విటేషన్ లేదని ప్రచారం జరిగినా.. అతనికి అధిష్టానం నుంచి పిలుపు మాత్రం వచ్చింది. అప్పటికే కొడుకుపై కేసు కలకలం దేశవ్యాప్తంగా దావణంలా పాకిపోయింది. అయినా బండిపై క్రేజ్ తగ్గలేదు. కార్యకర్తలు, కాషాయదళం అతన్నిచాలా దగ్గరగా ఓన్ చేసుకున్నారనడానికి ఈ సంఘటన అద్దం పడుతోంది. ఈ క్రమంలో అధిష్టానానికి బండిపై నెగిటివ్ థింకింగ్ లేకపోయినా..ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీ పగ్గాలిస్తే ఎటువంటి సంకేతం వెళ్తుందోనని తల్లడమల్లడమవుతోంది.
అందుకే మంత్రి పదవినే కొన్ని రోజులు కొనసాగించి.. ఆ తరువాత వేటు వేయాలా? ఈ చర్చ అంతా సద్దుమణిగిన తరువాత రాష్ట్ర పగ్గాలు అప్పగించాలా? లేకపోతే లండన్ పారిపోయిన భగీరథ్ను పోలీసుల ఎదుట లొంగిపోయి.. శిక్షపడేలా చేయడం ద్వారా .. నేరానికి శిక్ష వేయడం ద్వారా పరిస్థితి తీవ్రతను తగ్గించినట్లవుతుంది.. ఆ తరువాత పార్టీ పగ్గాలిచ్చినా ప్రాబ్లెం ఉండదనే కోణంలో కూడా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.