హైడ్రాను ఇరుకున పెట్టాలని చూసిన బీఆరెస్కు.. బతుకమ్మ కుంట వివాదం వెంటాడుతోంది. దీన్ని ఓ అస్త్రంలా ప్రయోగిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. హైడ్రా చేసిన పనుల్లో సర్కార్కు మంచి గుర్తింపును తెచ్చింది బతుకమ్మ కుంట చెరువు పునరుద్దరణ. అది అంతకు ముందు ఆక్రమణలకు గురై ఉండేది. సీఎం ఆదేశాలతో హైడ్రా దీనిపై నజర్ పెట్టింది. ఈ కబ్జాలో ఉన్నది అక్కడి అంబర్పేట నియోజకవర్గ బీఆరెస్ ఇంచార్జి ఎడ్ల సుధాకర్రెడ్డి. దీంతో సర్కార్ మరింత దూకుడుగా బతుకమ్మ కుంట పునరుద్దరణపై దృష్టి కేంద్రీకరించింది. వడివడిగా మొత్తం కబ్జా చెర నుంచి విడిపించి. కంచె వేసి.. దానికో ఓ రూపు తీసుకొచ్చారు. చట్టూ కాంపౌండ్ వాల్ కట్టి.. పాదాచారుల కోసం ప్లాట్ఫాంలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.
దీని ప్రారంభోత్సవానికి స్వయంగా సీఎం వెళ్లడం.. మీటింగు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి జనానికే కాదు .. తెలంగాణ జనానికి అందరికీ తెలిసింది… బతుకమ్మ కుంట ఎలా జీవం పోసుకుని.. కొత్తరూపు సంతరించుకున్నదని! అప్పటికే దీనిపై ఎడ్ల సుధాకర్రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. ఇది కబ్జా కాదని, తాను బాజాప్తా కొన్నదని చెప్పుకొచ్చాడు. దీనిపై ఇటీవలే స్టే విధించింది కూడా కోర్టు. అక్కడ గోడలపై హైడ్రా పేరును తొలగించాలని ఆర్డర్ వేయడం.. దాన్ని తొలగించడం జరిగిపోయింది. అప్పుడు ఆ సభలో డైరెక్టుగా సుధాకర్ పేరు తీయకుండా విమర్శలు గుప్పించాడు సీఎం… బీఆరెస్పై.
కేసీఆర్ సభకు హెలికాప్టర్లతో పూలు చల్లించినందుకు.. నజరానాగా ఈ బతుకమ్మ కుంట భూమిని రాసిచ్చారని ఆరోపించారు. తాజాగా నిన్న ఫ్యూచర్ సిటీ ఆఫీసు బిల్డింగు ప్రారంభోత్సవ సభలో కూడా సీఎం ఈ ప్రస్తావన తీశాడు. ఎడ్ల సుధాకర్రెడ్డి పేరును ఉచ్చరించాడు. హెలికాప్టర్ ద్వారా పూలు చల్లినందుకే కేసీఆర్ ఈ భూమిని రాసిచ్చాడని, తాము దాన్ని లాక్కుని, బాగు చేసి జనానికి మేలు చేశామని అన్నారు. హైడ్రాను, ఫ్యూచర్ సిటీని బద్నాం చేద్దామని కంకణం కట్టుకున్న కేటీఆర్, హరీశ్రావు, కేసీఆర్లకు .. ఈ బతుకమ్మ కుంట ఇష్యూను ఓ అస్త్రంలా ప్రయోగిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కేటీఆర్, హరీశ్రావులు పాడిందే పాటగా రాగం అందుకున్నారు.
అంతకు ముందు కేసీఆర్.. హైడ్రాను ఒక్క కలంపోటుతో తీసి అవతల పారేస్తానని అన్నారు. హైడ్రా వల్ల ఎలాంటి మేలు జరిగిందో.. తెలియజేయడానికి బతుకమ్మ కుంట ఓ మంచి నిదర్శనంగా నిలుస్తోంది ప్రభుత్వానికి. అంతే కాదు.. హైడ్రాను ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో.. జనాలకు తెలియజేయడానికీ దీన్నే వినియోగిస్తున్నారు. ఆ పార్టీ ఇంచార్జి ఆక్రమించిన భూమిని లాక్కున్నామనేది ఒక కారణంగా చూపితే.. ఆ ఇంచార్జి కేసీఆర్ సభకు వచ్చిన వేళ అతనిపై హెలికాప్టర్తో పూలు జల్లినందుకు నజరానాగా ఈ భూమిని అతనికి అప్పగించారు.. అనే కారణాలను అస్త్రాలుగా సంధించనున్నారు.