పశ్చిమ బెంగాల్ ఫలితాలతో తెలంగాణ బీజేపీ భలే జోరు మీదున్నది. ఇక్కడా అధికారంలోకి వచ్చేసినంత సంబరపడుతున్నది. ఈనెల 10న హైదరాబాద్కు మోడీ రానుండటం.. కొత్త ఊపును తెస్తుంటే.. అంతకు ముందే పశ్చిమ బెంగాల్ ఫలితాలు వెయ్యేనుగుల బలాన్నిస్తున్నాయి వారికి. ఈ సందర్భంగా అమిత్ షా.. వ్యూహం.. ఆయన ఎత్తుగడలు మళ్లీ ఆ పార్టీలో చర్చకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఏకంగా మోటూభాయ్ జర… ఇదర్ బీ దోఖోనా…? అనే కామెంట్లు పెడుతున్నారు. మోటు భాయ్.. అంటే అమిత్ షాను వాళ్లు ముద్దుగా పిలుచుకునే పేరన్నమాట. అయితే బీజేపీ తెలంగాణలో లేచినట్టే లేచి ఢాం.. అని పడిపోవడానికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు.
బీఆరెస్తో టై అప్ అవుతున్న క్రమంలో కేసీఆర్ చెప్పినట్టు కేంద్రం వినాల్సి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్కు, బండి సంజయ్కు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది ఆ రోజుల్లో. అధికార పార్టీకి కొరకరాని కొయ్యలా మారాడు బండి. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండేవాడు. పార్టీ స్టాండ్ను జనాల్లోకి బలంగా తీసుకుపోయే క్రమంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేవాడు. తన పదజాలం కూడా పరుషంగానే ఉండేది. దీన్ని భరంచలేని పరిస్థితిలో కేసీఆర్ ఉండేవాడు. దీంతో చూసీ చూసీ ఆ కుర్చీకే స్పాట్ పెట్టించేశాడు కేసీఆర్. సరిగ్గా పార్టీ ఎదిగే సమయంలో, మంచి ఊపు వస్తుందనుకున్న సందర్భంలో… మొదటికే మోసం వచ్చినట్టుగా.. బండి సంజయ్ అధ్యక్ష పదవిని కేంద్రం చేత ఊడబెరికించేశాడు కేసీఆర్.
దీంతో ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా పడిపోయింది. బీఆరెస్, బీజేపీ ఒక్కటే.. అందుకే ఇక్కడ బీజేపీ బలపడకున్నా సరే.. కేసీఆర్ ను బలపర్చాలనేది కేంద్రం ఉద్దేశ్యంగా ఉందని కషాయ శిబిరానికి అర్థమైపోయింది. దీంతో తెచ్చుకున్న సత్తువ కాస్త సన్నగిల్లిపోయింది. ఆ తరువాత పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసకు చాన్స్ ఇవ్వొద్దనేది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీ రాకున్నా సరే…. కేంద్రంలో మళ్లీ మోడీనే పీఎం కావాలె…ఇదే వాళ్ల టార్గెట్ అప్పుడు. కానీ ఇక్కడ బీఆరెస్ పతనం కావడంతో.. ఇక కేసీఆర్ను మోసి లాభం లేదనుకున్నది. అందుకే బాహాటంగా ఆ పార్టీతో దోస్తానా గురించి మాట్లాడటం లేదు.
నీ దారి వేరు.. నా దారి వేరు.. అన్నట్టుగానే రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అవసరమైతే ఎన్నికల ఫలితాల తరువాత.. మద్దతిచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే దూరాలోచనతో రెండు పార్టీలూ ఉన్నాయి. ఇక మళ్లీ బీజేపీ పార్టీని గాడిన పెట్టాలంటే.. బండి సంజయ్కే మళ్లీ పార్టీ పగ్గాలివ్వాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఇక పార్టీని లేపడం కష్టం … అనుకున్ని నిరాశకు లోనైన క్యాడర్కు పశ్చిమ బెంగాల్ ఫలితాలు కొత్త ఊపిరిలూదాయి. మళ్లీ ఒక్కసారిగా వారి దృష్టి అంతా బండి సంజయ్ మీదకు మళ్లింది. సంజయ్కే మళ్లీ పగ్గాలు కట్టబెడితే .. తెలంగాణలో ఏకంగా అధికారంలోకి రాకపోయినా.. గణనీయమైన సీట్లు సాధిస్తాదనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా బండి ని తొలగించకపోతే అసెంబ్లీలో 20 నుంచి 25 సీట్లకు వరకు రాబట్టేదని, హంగ్ దిశగా రాజకీయాలు కీలకమలుపు తిరిగేవని లెక్కలేసుకుంటున్నారు. అప్పుడు చేసి తప్పిదం మళ్లీ ఇప్పుడు సరిదిద్దుకుంటే భవిష్యత్ మనదేననే ధీమాను వ్యక్తపరుస్తున్నది కాషాయ దండు.