బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మొన్నటివరకు అధికార కాంగ్రెస్.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై వరుసగా సిట్ విచారణలకు ఆదేశించింది. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్, హరీశ్ రావుల పేర్లు రావడం.. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు.. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ హరీశ్ రావు పేరు ప్రధానంగా వినిపించింది. ఇప్పటికీ కూడా ఆ కేసులో విచారణ జరుగుతూనే ఉన్నది.మరోవైపు రాష్ట్రంలో జరిగిన అన్ని ఉపఎన్నికలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అందుకు కారణం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలే అని ప్రజలు బలంగా నమ్మడమే అని తెలుస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీకి గతేడాది కిందట వరకు కేవలం పొలిటికల్ ప్రెజర్ మాత్రమే ఉండేది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చారో నాటి నుంచి మాజీ సీఎం, గులాబీ బాస్ ఇంటిపోరును ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేసీఆర్ అంగీకరించారని.. అది ఇష్టం లేక తాను తీవ్రంగా వ్యవతిరేకించినట్టు కవిత చెప్పుకొచ్చారు. నాటి నుంచి కవిత గులాబీ పార్టీని ఇరకాటంలో పెడుతూనే వస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే సంకేతాన్నిఆమె పంపించారు. తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేశారు. కేసీఆర్ హయాంలో అభివృద్ది జరగలేదని, అవినీతి అక్రమాలు జరిగాయని, ఉద్యమకారులకు న్యాయం చేయలేదని విమర్శలు చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రసేన (టీఆర్ఎస్) అని దానికి నామకరణం చేశారు. పాంచజన్యం పేరిట పార్టీ విధివిధానాలు ఖరారు చేశారు. నిన్న ఉదయం మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించిన ఆమె.. త్వరలోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే టార్గెట్గా తన పొలిటికల్ కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. అయితే, కవిత తన మాటల్లో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను చాలా టార్గెట్ చేశారు. ఇప్పటి కేసీఆర్.. కేసీఆర్ కాదని.. మరమనిషి అని సొంత తండ్రిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, అవినీతి రాజ్యమేలిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో తానూ భాగమైనందుకు తనను క్షమించాలని అదే వేదికగా ప్రజలను కోరారు.
Telangana Govt: తెలంగాణలో మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టు మిషన్లు
టీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన కవిత.. తనను ఇకమీదట అక్క అని పిలువద్దని, అమ్మ అని పిలువాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కర్కోటక పాలన నడుస్తుందని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలుస్తుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తి బయటకు రాకుండా ఫౌంహౌస్ కే పరిమితం అయ్యారని విమర్శించారు.అలాంటప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఫైర్ అయ్యారు. ఇకమీదట రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నేటికి ఉద్యమపార్టీ టీఆర్ఎస్ను గుర్తుచేసుకుంటున్న తరుణంలో కవిత టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం కాస్త ప్లస్ అయ్యే అంశం. కానీ, బీఆర్ఎస్ కూడా పార్టీ పేరును మరల టీఆర్ఎస్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకు ఈసీ నుంచి మరల అనుమతి పొందాల్సి ఉన్నది. వచ్చే ఎన్నికల్లో తన సొంత కూతురే కేసీఆర్ను టార్గెట్ చేస్తే గులాబీ పార్టీకి ప్రజల నుంచి ఇబ్బందులు తప్పవు. కేటీఆర్, హరీశ్ రావులతో పాటేకీలక నేతలు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాగా, కవిత పార్టీపై గులాబీ బాస్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.