ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా.. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో చేయాల్సినోళ్లే చేతులెత్తేస్తే..! అదే జరుగుతున్నది ఓటరు జాబితా సవరణ (సర్) విషయంలో. బీజేపీ ఓ వైపు ఉన్న ఓట్లు తొలగించేందుకు ఈసారి సర్ ప్రక్రియను కట్టుదిట్టం చేస్తోంది.. జాగ్రత్తగా ఉండి అర్హులైన ఓటర్లను కాపాడుకోవాలని ప్రభుత్వం సూచించినా.. శిక్షణనిచ్చినా.. అవగాహన పరిచినా.. ఫలితం లేకుండా పోతుంది.
ఫీల్డు లెవల్లో బీఎల్వోలు పత్తా లేకుండా పోతున్నారు. అంతకు ముందున్నా చుట్టపు చూపుగా ఇళ్లలోకి వచ్చి పోయే వారు.. ఇప్పుడు సర్ మొదలైన నాటి నుంచి ఎక్కడ్నో ఒక దగ్గర మకాం వేసి కూర్చుని తీరిగ్గా అక్కడ్నే కూర్చుని తమ వద్దకు వచ్చిన వారి అనుమానాలు నివృత్తి చేస్తూ రోజులు లెక్క బెట్టుకుంటున్నారు. ఇదెప్పుడు ఒడుస్తుందా? మా పాణం ఎప్పుడు నిమ్మళమైతదా? అని.
ఇంటింటికి ఎన్యుమరేషన్ ఫారాలే ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ కొందరికి ఇచ్చినా… వాటిని జిరాక్సులు తీసుకోండని చెబుతున్నారు. తప్పులు రాస్తే మాకు తెల్వదు.. మీ ఓటు గల్లంతే.. అందుకే ఒకటికి పది సార్లు రాసైనా సరే, ఓటును దక్కించుకోవాలంటే.. జిరాక్సు కాపీలు మీ దగ్గర ఉండాలె… లేకపోతే మాకు తెలవదు.. మీ ఇష్టం..!అని తెగేసి చెప్పి.. అయోమయం సృష్టించి.. అదెలా నింపాలో చెప్పుకుండానే వెళ్లిపోతున్నారు.
ఏదో గ్రూపు-1 పరీక్షపత్రాన్ని నింపినంత శ్రద్దగా, భయంగా.. అయోమయంగా.. ఆందోళనగా నింపుతున్నారు. నింపిన తరువాత వాటిని ఇవ్వాలంటే.. ఎవరూ ఇంటికి రారట. మనమే వెళ్లి .. వాళ్లు ఎక్కడున్నారో కనుక్కుని.. గుమిగూడిన మందిని తోసుకుని, తమ ఫారాలు చెక్ చేపించుకోవాలి. అందులో ఏ ఒక్క అక్షరం తప్పైనా ఫోటో వైట్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. మళ్లీ ఇంటికి పోయి..వాటిని సరిదిద్ది.. ఈసారైనా తమ ఫామ్ ఓకే కావాలి దేవుడా.. ప్లీజ్..ప్లీజ్.. ప్లీజ్..!అని మొక్కుకుని పోయి వారి చేతికిచ్చి వారు ఓకే అంటే ఏడుకొండలవాడి మెట్లన్నీ కాలినడకన ఎక్కిన ఆనందం, ఆయాసం నిండిన ముఖాలతో ఇంటికి రావాలన్నమాట.
ఈలోగా పుణ్యకాలం కాస్త దగ్గరపడుతోంది. ఫారాలైతే కొందరు చేతబట్టుకుని వాటిని తమకు తెలిసిన వారిందరికీ చూపుతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అనుమానాలుంటే అడుగుతున్నారు. ఇన్నిసార్లు ఓట్లేసినం.. కానీ ఇప్పుడేమో ఈ ఓటు ఉంటుందా? ఊడుతుందా? అని తమ భయాన్ని వెళ్లబోసుకుంటున్నారు. లిస్టులో పేరు వచ్చేదాకా ఇదే టెన్షన్ క్రియేట్ అయి ఉంది అందరిలో.
మరోవైపు ఈ సమయం సరిపోదని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామంటున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీస్తే మన బీఎల్వోలు చేసిన ఘనత, ఘనకార్యాలు, వారి కమిట్మెంట్ కళ్లకు కట్టినట్టు కనిపించింది. కుక్కతోకను పట్టుకుని గోదారి ఈదినట్టే చేస్తున్నారు బీఎల్వోలు. చాలా మంది మైనార్టీ ఓటర్లు పొద్దున్నే ఆ ఏరియా బీఎల్వో ఎవరో తెలుసుకుని ఇంటి ముందే వచ్చి కూర్చుకుంటున్నారు. లేదా ఫోన్లు చేసి ఎక్కడున్నారో కనుక్కొని అక్కడికి వచ్చి.. మరీ అడిగి అడిగి నింపుతున్నారు.
ఈ సమయంలోనైనా వారికి ప్రత్యేక ఇన్సెంటివ్లైనా ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో మాకేం వచ్చేదుంది..? ప్రయాస తప్ప.. !అని అలా అలా నెట్టుకొస్తూ … గడువు ఎప్పుడు గుడుస్తుందో మోడీ దేవుడా..? అని మొక్కుకుంటున్నారు.