రాజకీయంలో అంతే. ఒక్కోసారి ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది. మన వ్యూహం బెడిసికొడుతుంది. అసలుకే ఎసరు వస్తుంది. రైతు భరోసా విషయంలో సర్కార్ తీరు కూడా ఇట్లనే తయారయ్యింది. రైతు పండుగ పేరుతో బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేశారు. తొమ్మిది వేల కోట్లు వేస్తున్నాం.. అని చెప్పుకునేందుకు ఆర్బాటంగా రైతులతో కార్యక్రమం పెట్టారు.
దీంట్లోనూ మళ్లీ పాత రాజకీయ రొటీన్ రొడ్డ కొట్టుడు స్పీచ్. పైగా అప్పుల ప్రస్తావన. ఇదీ రొటీనే. వినీ వినీ జనం చెవులకున్న తుప్పు వదిలింది గానీ, సీఎం నోటికి మాత్రం ఏమాత్రం విసుగు రావడం లేదు. అసలట లేదు. నొప్పి పుట్టడం లేదు. అదే పనిగా ధారాళంగా పాడిందే పాటగా పాడుతూనే ఉన్నాడు.
సరే చెబితే చెప్పాడు లే. జనం ప్రభుత్వాన్ని తిట్టుకోకుండా అనుకుందామనుకుంటే.. రండి చర్చకు అని సవాల్ విసిరుండు సీఎం. ఇగ పనిలో పని కేటీఆర్, కేసీఆర్ను కూడా బాగానే అర్సుకుని వదిలేసిండు. మరి మంచి ప్రోగ్రాం.. మైకు దొరికింది.. బహిరంగ సభకు తక్కువ కాకుండా దాన్ని సూపర్ హిట్టు చేద్దామనుకుని.. పవర్ ఫుల్ పంచు డైలాగులన్నీ బట్టపట్టి మరీ దంచికొట్టిండు.
ఇక ఇదే దొరికింది మోఖా అనుకున్నడు కేటీఆర్. తెల్లారే ప్రెస్మీట్..నువ్వెక్కడంటే అక్కడ చర్చకు రెడీ.. ఢీ! అన్నడు. ఇగో మేం చేసిన అప్పులు.. కాగ్ లెక్కలు. మీరు చెప్పిన అప్పులు.. కాకి లెక్కలు..!అని కాయితాలన్నీ పట్టుకుని వచ్చి మాటకు మాట.. దెబ్బకు దెబ్బ అనే రేంజ్లో సమాధానమిచ్చాడు.
ఇది పక్కా పొలిటికల్ డైవర్షన్ అని తెలుసుకోలేని కొమ్ములు తిరిగిన, కాకల తీరిన కాంగ్రెస్ యోధులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి .. కమాన్.. బస్తీమే సవాల్ అని తలోదిక్కు పోయి… తలో మాట అన్నరు. పోలీసులు, రగడ, అరెస్టులు.. ! అసలు సంగతి మరిచారు.
అక్కడ రైతు భరోసా ఎంత మందికి పడ్డది. రైతులు ఏమనుకుంటున్నారు? ఇంకా ఎంతమంది ఖాతాలో పెట్టుబడి సాయం పడాలె..? అధికారులు ఏం చేస్తున్నారు? ఏమైనా సమస్యలున్నాయా? వీటి లెక్కల్లేవు. సమాచారం లేదు. అసలు సీఎంవోలో ఆ వ్యవస్థే లేదు. అంతా ప్రేక్షకపాత్ర వహించి.. అలా నోరెళ్లబెట్టి వాళ్లు కూడా ఆ తమాషా చూస్తూ కూర్చున్నారు.
ఇక ఇదై పోయిందా? కేటీఆర్ మళ్లో టాపిక్ ఎత్తుకున్నాడు. ఛలో కన్నెపల్లి పంప్హౌజ్.. కాళేశ్వరం నీళ్లు ఎందుకిస్తలేరు. పంప్హౌజ్ మోటర్లు ఎందుకు చాలు చేస్తలేరు. కరువు అన్నారు కదా..? మరి నీళ్లు రాకపోతే ఎట్లా..? అని కొత్త పంచాది తీసిండ్రు. మొన్నటి దాకా కరువు లేదు గిరువు లేదు.. ఏడు రకాల వరే వేసుకోవాల్నా..? దానికే బోనస్ ఇస్తరా? రైతులారా వరి ఇష్టమొచ్చినట్టు వేసుకోండని రెచ్చగొట్టిన ఇదే పార్టీ.. ఇప్పుడు ఎల్నినో అని కూనిరాగాలు తీస్తోంది.
మళ్లీ ఆ వ్యూహానికి చిక్కుకున్నది సర్కార్. ఏమైందయ్యా.. రైతు భరోసా ఏడదాక వచ్చే..? ఎంత మంది రైతులకు అందింది..? ఏడెకరాల వరకు సాయం అందిందట కదా? దాదాపుగా 5వేల కోట్లు రైతుల ఖాతాలో పడ్డయట కదా?
ఏమో ఎవరికి తెలుసు…? చెప్పేవారేరీ? వాస్తవానికి, అధికార పార్టీ వేసే వ్యూహంలో ప్రతిపక్షం పడాలె..? కానీ ఇక్కడ ప్రతిపక్షం పన్నిన వలలో సర్కార్ చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటోంది. మంత్రులు, సీఎంవో.. అధికార యంత్రాంగం అంతా కూడా ఒడ్డున ఉండి చూస్తున్నది. ఇదీ కాంగ్రెస్ సర్కార్ వ్యవస్థ విషాదం!