ఇప్పుడు కొలువుల లొల్లి పతాక స్థాయికి చేరుకున్నది. దీనికి పోలీస్ రిక్రూట్మెంట్ ఆజ్యం పోసింది. 19వేల పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్సైల ఉద్యోగాలు వేస్తామని చెప్పి కేవలం ఐదారు వేల తో సరిపెట్టాలని చూస్తున్న రేవంత్ సర్కార్ పై మండిపడుతున్నారు నిరుద్యోగులు. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్లు వేసేందుకు రెడీ అయ్యింది సర్కార్.
దీంతో పాత హమీలన్నీ వెలికి తీసి మరీ సర్కార్ను విమర్శిస్తున్నారు. ఇప్పటికే దిల్సుఖ్నగర్ లో చాలా సార్లు ఆందోళన చేపట్టారు నిరుద్యోగులు. దీనికి కవిత మద్దతుగా నిలిచారు. సచివాలయం ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. దీన్ని భగ్నం చేశారు. అయితే సీఎం మాత్రం ఈ పోలీసు కొలువుల మీద ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నిరుద్యోగుల నుంచి వచ్చే డిమాండ్లను కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు.
పైగా మీరు ఎంతైనా ఒర్రండి.. ఎండ్రిన్ తాగి చావండి.. నేను చేసేది నేను చేస్తా..! అని అడ్డుకునే ప్రతిపక్షాలనుద్దేశించి ఆయన అన్న మాటలను.. ఇప్పుడు నిరుద్యోగులు తమకు అన్వయించుకుంటున్నారు. అంటే అప్పుడేమో.. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిస్తానని ఓట్లు వేయించుకుని గద్దెనెక్కావు. ఇప్పుడేమో.. మమ్మల్నే చావమంటావా? అని ఏకంగా సీఎం అన్నమాటలను రికార్డు చేసుకుని మరీ మీడియాకు వినిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు.
దీనికి తోడు మొన్న నల్లగొండ సభలో సీఎం .. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 70వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని ప్రకటించడం కూడా పెద్ద లొల్లికి కారణమైంది. నిరుద్యోగ యువత భగ్గుమంటున్నది. బీఆరెఎస్ పాలన చివరలో వేసిన ఉద్యోగాలకు.. ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాటిని కూడా తామే ఇచ్చినవాటిగా తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని గుర్రుగా ఉన్నారు సర్కార్ మీద.
ఇక దీనిపై సర్కార్ వెనకడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. మొదట చెప్పిన విధంగానే ఐదు వేలకు మించి కానిస్టేబుళ్ల ఉద్యోగాలిచ్చేలా లేదు. దీనిపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సీఎంకు బహిరంగ లేఖ రాశారు. 20వేల ఉద్యోగాలు వేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కూడా నిరుద్యోగుల పక్షాన నిలిచాడు. ఇలా ప్రతిపక్షాలన్నీ ఏకమైన పోలీసు కొలువుల కోసం కొట్లాడుతున్నా.. సీఎం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
అయితే ఇవాళ టీఆరెస్ చీఫ్ కవిత ఓ ఆసక్తికరమైన కామెంట్ను పోస్ట్ చేశారు. అదీ ప్రత్యేకంగా కొలువుల గురించి. రెండు ప్రభుత్వాలు ఈ కొలువుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాయో తెలియజెప్పేందుకు ఆమె .. రెండింటి మధ్య పోలికలను సరిపోల్చారు. ఏం మారింది..? అనే టైటిట్లో ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. నాడు గులాబీ మోసం చేసిందని, నేడు హస్తం ద్రోహం చేసిందని పైన పేర్కొంటు.. ఏఏ విషయాల్లో ఎలా రెండు సర్కార్ల ప్రవర్తన ఉందో వివరించారు.
కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్ అనే ముచ్చటనే లేకుండెనని, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పుకున్నా.. ఆ హామీకి దిక్కులేకుండా పోయిందన్నారు. నాడు నిరుద్యోగ భృతి3,016 ఇస్తామని ఎగ్గొట్టారని, నేడు ఈ సర్కార్ కూడా రూ. 4వేల భృతిని ఎగ్గొడుతున్నారన్నారు. కొలువుల కోసం బిల్డప్ ఇచ్చినా.. ఎక్కడి కొలువులు అక్కడే ఖాళీగానే ఉన్నాయని, వేటినీ భర్తీ చేయలేదని కేసీఆర్ సర్కార్ను విమర్శించిన కవిత.. ఈ రేవంత్ సర్కార్ అప్పుడు వచ్చిన అరకొర పాత కొలువులకే కొత్త కలరింగ్ ఇచ్చుకుంటున్నదని ఎద్దేవా చేశారు.
పోలీస్ ఉద్యోగాలలో నాడు అపాయింట్మెంట్లలో తీవ్ర జాప్యం చేసిన కేసీఆర్ పాలన.. ఇప్పుడు ఆ పోలీస్ పోస్టులల్లో భారీ కోత విధించడమే కాదు.. అడిగితే లాఠీ చార్జి చేస్తున్నారని విమర్శించారు. అప్పటికీ, ఇప్పటికీ ఏం మార్పు రాలేదని, దొందూ దొందేనని కొలువుల విషయంలో కవిత సెటైరికల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్గా మారింది.