మంత్రి సీతక్క ..యూరియా యాప్పై ఉన్నదున్నట్టుగా మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలను ఆమె గుర్తించారు. ఎక్కడైతే సిగ్నల్స్ సరిగా రావడం లేదో, ఆన్లైన్ ద్వారా సరఫరాకు తీవ్ర అంతరాయమేర్పడుతుందో ఆమె గుర్తించాననే విషయం బహిరంగ పర్చారు.
దీనిపై సర్కార్కు కూడా ఆమె నివేదిస్తామన్నారు. ఇలా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే చోట మాన్యువల్గా వారికి యూరియా అందించాలని సీఎంను కోరుతానని కూడా ఆమె ప్రకటించారు. ప్రతిపక్షాలు దీనిపై చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. దీని వల్ల రైతులు యూరియాను సకాలంలో పొందలేకపోతున్నారని, ఈ ప్రక్రియకు వారికి అలవాటు లేనిదని చెప్పుకొస్తున్నారు.
అంతే కాదు.. ఇది పూర్తిగా బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని, దీని ద్వారా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతున్నారు. అయినా దీనిపై సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. ఏ మంత్రి చూసినా దీనిపై సమర్థింపు ప్రకటనే కానీ, ఇబ్బందులు గుర్తించినట్టు… మార్పులు చేర్పులు చేస్తున్నట్టు.. విధానాలను మారుస్తున్నట్టుగానీ ఎక్కడా చెప్పలేదు.
పైగా కేటీఆర్ను ఇందులో టార్గెట్ చేశారు.ఐటీ శాఖ మంత్రిగా చేసిన కేటీఆర్.. ఇంకా ఆనాటి పాత పద్దతులు పాటించాలని కోరుకుంటున్నాడని, చెప్పులను క్యూలో ఉంచి, రైతులు పడిగాపులు కాచే ఆ దుస్థితినే ఎంచుకోమంటున్నారని విమర్శించారు. వాస్తవానికి, ఇలా ప్రతిపక్షాలు విమర్శించవద్దనే ఈ యూరియా యాప్ను తెచ్చింది సర్కార్.
దశాబ్దాల తరబడి ఏ ప్రభుత్వం ఉన్నా.. యూరియా కోసం ప్రతి సీజన్లో చెప్పులను క్యూలో ఉంచడం..దీన్ని మీడియా హైలెట్ చేస్తూ.. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశారా? అని అధికార పార్టీని టార్గెట్ చేయడం కామన్గా మారింది. దీనికి చరమగీతం పాడుదామని భావించింది కాంగ్రెస్ సర్కార్. కానీ అది బెడిసి కొట్టింది.
ఒకేసారి ఈ టెక్నాలజీ ద్వారా యూరియాను పొందడం గ్రామీణ రైతాంగానికి పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. దీంతో రైతాంగం నుంచి కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మొత్తానికి ఇవాళ మంత్రి సీతక్క కూడా ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో జరిగిన కార్యక్రమానికి ఆమె హజరై .. తరువాత యూరియా యాప్ గురించి మాట్లాడారు.
ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తేవాలని భావిస్తుందని, అందులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని, అలా ఎదురైన ఆటంకాలను పరిగణలోకి తీసుకుని.. వాటిని మార్చుకుంటూ పోవాలన్నారు. ఎక్కడైతే యూరియాను యాప్ ద్వారా సేకరించడం కష్టంగా ఉందో… అక్కడ మాన్యువల్గా సరఫరా చేయాలని సీఎంను కోరుతున్నట్టు ఆమె ప్రకటించారు.