ఓ వైపు కవిత విమర్శలు.. మరోవైపు రేవంత్ కౌంటర్లు! ఇక దిగిరాక తప్పలేదేమో బీఆరెస్కు. బీఆరెస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. పలు తీర్మానాలు చేసుకున్నారు. అందులో కీలకంగా రెండు అంశాలు చర్చకు వచ్చాయి. ఒకటి.. సిట్టింగులకు మళ్లీ టికెట్లు ఇవ్వమనే అంశం. మరొకటి రాష్ట్ర కమిటీ మినహా కమిటీలన్నీ రద్దు చేశామనడం. ఇక మొదటి పాయింటుకు వద్దాం. కేసీఆర్ మాజీ ఎమ్మెల్యేలను, ప్రస్తుత ఎమ్మెల్యేలను బాగా క్లాస్ పీకారట. తగినంత సమాచారం తీసుకురాకుండానే మీటింగుకు వచ్చారని.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ను కేంద్రం వచ్చే నెల నుంచి తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయడం ద్వారా లక్షల్లో ఓట్లు తీసేశారు. ఇక్కడ కూడా అలా జరగకుండా ఉండేందుకు బీఎల్వోల వద్ద ఉన్న ఓటర్ల డేటా సమాచారాన్ని తీసుకురావాల్సిందిగా కేసీఆర్ సూచించారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, మాజీలు సరైన సమాచారం తీసుకురాలేదట. దీంతో కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఈ సమాచారాన్నే తీసుకురాలేని వారు మీరు ఎమ్మెల్యేలుగా ఏం వెలగబెడతారు? అని మందలించి… మళ్లీ అందరికీ టికెట్లు వస్తాయని భ్రమపడకండని కూడా ఓ వార్నింగ్ ఇచ్చేశారట. ఫీల్డు లెవల్లో ఉన్నవారికి… జనంతో టచ్లో ఉండేవారికి మాత్రమే టికెట్లుంటాయని కూడా సిగ్నల్ ఇచ్చారట.
అంతే కాదు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సరిపోదు.. జనాల్లో ఉండాలని పిలుపునిచ్చారట. చిన్నబాస్ రామన్ననే ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటారు. ఆయన ప్రత్యక్ష ఉద్యమాలకు దూరమైన చాలా రోజులైంది. వీళ్లు కూడా దానికే అలవాటుపడ్డారు. అంతెందుకు .. పెద్ద సారు కూడా నిత్యం ఆ సోషల్ మీడియాలోనే మునిగి తేలుతుంటారట. దగ్గరగా ఆయన్ను చూసేవారు చెబుతారు. ఇక ఈ విధానం మాకైతే ఓకే. మీకు నాట్ ఓకే అని డిసైడ్ చేసేశారు పెద్దసారు. ఇచ్చిన వారికే మూడు మూడు సార్లు టికెట్లు ఇస్తిరి. జనానికి రోత పుట్టింది. వారి మీద.. కేసీఆర్ పదే పదే తీసుకున్న ఈ నిర్ణయం మీద. అందుకే కర్రుకాల్చి వాత పెట్టారు. దీంతో ఇప్పటికైనా తేరుకుంటున్నట్టున్నారు. టికెట్ల మార్పు ఉంటుంది? కొత్త వారికి చాన్సు ఉంటుందనే సంకేతమైతే ఈ మీటింగు ద్వారా పంపగలిగారు. ఇదే పెద్ద మార్పని చెప్పాలి.
ఇక రెండోది.. కమిటీలన్నీ రద్దు.
అసలు కమిటీలు లేక ఎన్ని రోజులవుతున్నది? అధికారంలో ఉన్నప్పుడూ పట్టించుకోలేదు. ప్రతిపక్షంలోకి వెళ్లినా పట్టింపులేదు. జిల్లాలకు అధ్యక్షులుగా మాత్రం మాజీ ఎమ్మెల్యేలను నియమించి చేతులు దులుపుకున్నారు. అనుబంధ సంఘాలకు కమిటీలు లేక ఏళ్లు గడిచింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పదవులు లేక వేచి చూసి విసిగిపోయారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన తరువాతైనా తమ అవసరం ఉంటుంది కాబట్టి.. పార్టీ పదవులున్నీ నింపుతారేమో.. ఆ వేదికగానైనా ప్రజా ఆందోళనలు చేద్దామని అనుకున్న కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.
ఇదిగో ఇప్పుడు కమిటీలన్నీ రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఓ రకంగా చెప్పాలంటే వీరు రద్దు చేసింది. జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న వారిని మాత్రమే. అంతకు మించి ఎక్కడా ఏ కమిటీలు లేవు. రాష్ట్ర కమిటీ ఒకటుంటుంది. అంతే. ఆన్లైన్, ఆఫ్లైన్ సభ్యత్వాలు చేపించి తరువాత ఈ కమిటీలు వేస్తారట. దీని ద్వారానైనా పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసే వారికి పార్టీ పదవులు దక్కుతాయనే ఆశ చిగురించింది. ఇది రెండో మార్పు. ఇక పెద్ద మార్పులేమీ లేవు. అదే పాత వైఖరి .. వాటి గురించి తరువాత చర్చించుకుందాం.