కొడంగల్లో సీఎం టూర్.. బహిరంగ సభ అనగానే పొలిటికల్ సర్కిల్ అంతా ఒక్కసారిగా అలర్టయ్యింది. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. కేటీఆర్ .. సీఎంపై చేసిన ఘాటు విమర్శలు, కామెంట్లు.. బీఆరెస్, బీజేపీ వార్.. ఈ నేపథ్యంలో సాగిన రేవంత్ కొడంగల్ పర్యటన కేవలం లోకల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు, శంఖుస్థాపనలకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రేవంత్ సీఎ అయిన తరువాత జరిగిన బహిరంగ సభలలో ఇదొక్కటే అన్నింటికీ భిన్నమని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఆయన పక్కా లోకల్ స్పీచ్నే ఎంచుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ది గురించే మాట్లాడారు.
అక్కడి ప్రజానీకం, లోకల్ లీడర్ల కృషి, సహకారం, తన ఉన్నతికి వారిచ్చిన తోడ్పాటు.. భవిష్యత్తులో మరింత మద్దతు కోరిన వైనం.. అంతా అంతా డిఫరెంట్ యాంగిల్స్ స్పీచ్ ఆయనది. ప్రసంగం మొత్తం కరెక్టుగా అరగంట సాగింది. ఇది కూడా గత సభలతో పోల్చితే పూర్తి భిన్నం. దాదాపు ఆయన ఎక్కడ సభల్లో మాట్లాడిన గంట.. ఆపై సాగుతుంది. మెల్లగా ప్రారంభమై.. మధ్యలో పుంజుకుని.. చివరలో స్పీడ్ పెరిగి.. రాజకీయ విమర్శల పదును తేలిన మాటలతో వాడి వేడిగా ప్రసంగం అక్కడి వాతావరణాన్నే మార్చేస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో అవి తీవ్ర చర్చకు తావిస్తాయి. విమర్శకులకు కొద్ది రోజుల పని దొరుకుతుంది. సోషల్ మీడియాలో సీఎం మాటల పరమార్థం వెనుక లోతులు గుంజే పనిలో పడతాయి. ప్రతిపక్షాలను ఆయన విమర్శించిన వైనం వైరల్గా చక్కర్లు కొడుతూ ఉంటాయి.
ఇవన్నీ ఆయన సభలలో స్పెషల్ ఎఫెక్ట్స్. కానీ ఇవాళ జరిగిన కొడంగల్ సభలో అవేమీ లేవు.. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు శంఖుస్తాపన చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. పక్కా లోకల్ స్పీచ్ కొనసాగింది. రేవంత్ ఎప్పుడు కొడంగల్, మహబూబ్నగర్లో సభలు జరిగినా లోకల్ స్పీచ్ మేజర్ పార్ట్ తీసుకుంటుంది. ఇక్కడా అలాగే కొనసాగింది. లోకల్ లీడర్లను పేర్లు పెట్టి మరీ పిలుస్తూ అందరూ తనకు గుర్తున్నారని యాది చేసుకోవడం సీఎంగా ఎదిగినా.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే నానుడిని జ్ఞప్తికి తెచ్చింది అక్కడి వారికి. అప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ కోసం ఎన్ని తంటాలు పడ్డాయో.. ఎక్కడెక్కడికి తిరిగామో… పాత రోజులు గుర్తు చేస్తూనే.. ఇప్పుడు తనే సీఎంగా అయిన తరువాత ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నదో ప్రత్యక్షంగా చూస్తున్నామని తెలియజేశారు.
2009లో మీరు నాటిన మొక్కను నేను.. ఇవాళ పెరిగి పెద్దయ్యాను. చెట్టయ్యాను. ఈ చెట్టును కాపాడుకోవాల్సింది మీరే. మా కొడంగల్ బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగాడో ..నని మీరు తలెత్తుకుని చెప్పుకునేలా చేస్తాను… అని వారిలో భరోసా నింపారు. లగచర్ల ఫార్మా సిటీ డెవలప్మెంట్, సిమెంట్ ఫ్యాక్టరీ, రైల్వే లైన్, కోస్గి నుంచి శంషాబాద్ రోడ్డు పనులు.. ఇవన్నీ వచ్చే ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి కావాలని ఆయన డెడ్లైన్ విధించారు. పనిలో పని సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ ఓ మారు గుర్తు చేశారు ఈ వేదికగా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి.
మొత్తంగా తను అక్కడకు సీఎం హోదాలో వెళ్లినా.. పక్కాలోకల్ ఎమ్మెల్యేగా అక్కడి జనంతో కలిసిపోయారు. కొడంగల్ ప్రజలందరి వాడినని అనిపించుకున్నారు. ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ లేకపోవడం కూడా రాజకీయంగా చర్చకు తావిచ్చింది.