KTR Protest: తెలంగాణలో నీటి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు రాష్ట్రంలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు భారీగా నీరు వృథాగా పోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శించి అక్కడి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జనగామ వద్ద బీఆర్ఎస్ బృందం అరెస్ట్
కన్నేపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను జనగామ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కేటీఆర్ ఒక్కరికే అనుమతి ఇస్తామని, మిగిలిన నాయకులను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. విపక్ష నేతలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేయడమేనని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు.
రైతుల గోస పట్టదా?
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఎగువన నీళ్లు లేక రైతులు నాట్లు వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకవైపు లక్ష క్యూసెక్కుల గోదావరి నీరు వృథాగా సముద్రం పాలు అవుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? కన్నేపల్లి వద్ద ఉన్న మోటార్లను ఆన్ చేసి నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తూ, రైతుల పొలాలను ఎండబెడుతున్నారని కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు.
మొత్తంగా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు భరోసా కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
Also Read: బిష్ణోయ్ గ్యాంగ్కు కోలుకోలేని షాక్.. జాయింట్ ఆపరేషన్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మృతి!
నీరు వృథాగా పోతుంటే మోటార్లు ఎందుకు ఆన్ చేయట్లేదు: KTR pic.twitter.com/SMbsY3xL2p
— Neredu Jothi (@neredu13668) July 5, 2026