మొన్నటిదాకా కేటీఆర్ .. అవసరమైతే.. నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా! అనే డైలాగును విరివిగా వాడుతూ వచ్చాడు. రాజకీయ సన్యాసం తీసుకుంటాననే కామెంట్ ఆయన నోటి వెంట నుంచి కామన్గా వస్తున్నదీ మధ్య. ఈ రాజకీయ సన్యాసం అనే మాటనే ఉత్త బేవార్స్ ఛాలెంజ్ అని కేసీఆరే గతంలో పలు ఇంటర్వ్యూలలో దీన్ని కొట్టిపారేశాడు. కానీ దీన్ని పట్టుకుని వేలాడుతున్నాడింకా కేటీఆర్.
ఇప్పుడు ఛాలెంజ్ల లెక్క హద్దులు దాటింది. ఎంతలా అంటే ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్కు ఆఫర్ ఇచ్చినట్టుగా ఓ వారం రోజులు కేసీఆర్ను సీఎం చేయాలట. ఎందుకంటే… ఇప్పుడు నడుస్తున్న కన్నెపల్లి పంప్హౌజ్ లొల్లికి పరిష్కారం ఆయనే చేసి చూపుతాడట. ఒకవేళ అలా చేయకపోతే బీఆరెస్ పార్టీనే రద్దు చేస్తామని ప్రకటించారు కేటీఆర్. చేసి చూపెట్టకపోతే బీఆరెస్ పార్టీని కూడా రద్దు చేస్తామని ప్రకటించాడు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
ఈ ఛాలెంజ్ చాలా కొత్తగా ఉంది. చర్చకు వచ్చింది. పెద్దలతో చర్చించకుండా ఉత్తగానే నోటికొచ్చింది వాగేందుకు జగదీశ్రెడ్డి .. చిన్న లీడరేం కాదు. ఈ ఛాలెంజ్ వెనుక చర్చకు వచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా కన్నెపల్లి పంప్హౌజ్ను నింపుకోవడం ద్వారా రాబోయే కరువు పరిస్థితులను ఎదుర్కోవచ్చని సర్కార్కు సూచన చేయడంతో పాటు.. కాళేశ్వరం ఏం వట్టిపోలేదు.. అది వేస్ట్ కాలేదు..దాన్ని సద్వినియోగం చేసుకుంటే కరువు పరిస్థితులను ఎదుర్కోవచ్చనే విషయం జనానికి మరోమారు గుర్తు చేయడం.
ఇక రెండో పాయింట్.. ఈ పంప్ హౌజ్ ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోసుకోవడం మూలంగా దాదాపు 150 టీఎంసీ నీరు కరువు పరిస్థితుల్లో రైతుకు తోడుగా ఉండి.. సాగుకు రక్షణగా ఉంటుందనే విషయాన్ని తెలియజెప్పడం. ఇలా అవకాశం ఉన్నా.. ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదని ఎత్తి చూపడం..!
అందుకే ఈ కన్నెపల్లి పంప్హౌజ్ అంశాన్ని బీఆరెస్ అంత సీరియస్గా తీసుకున్నది. కేటీఆర్ సైతం దీనిపై బహిరంగ వేదికలపై ఎక్కువగా తన ప్రసంగాల ద్వారా జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వృథాగా లక్ష క్యూసెక్కులు పోతున్నా.. సర్కార్ ఈ విషయంలో పట్టించుకోవడం లేదని, పంతానికి పోయి.. కేసీఆర్ పేరు బద్నాం చేయడానికే చూస్తుంది తప్ప.. రైతుల మేలు కోసం పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నాడు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో (KLIP) ‘కన్నెపల్లి పంప్హౌస్’ అనేది మొదటి అత్యంత కీలకమైన అడుగు. మేడిగడ్డ బ్యారేజీ ద్వారా గోదావరి నది నుండి లభ్యమయ్యే నీటిని భారీ మోటార్ల ద్వారా ఎత్తిపోసేందుకు దీనిని నిర్మించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్ మండలంలోని కన్నెపల్లి వద్ద ఇది ఉంది. ఈ పంప్హౌస్లో గోదావరి నీటిని ఎగువకు లిఫ్ట్ చేయడానికి భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తే, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీరు అన్నారం బ్యారేజీకి చేరుతుంది.
ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో, కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నది. అయితే అసలు మేడిగడ్డ వద్దే పిల్లర్లు కుంగాయని, ఇది ఎందుకు పనికిరాదని, కాళేశ్వరం .. కూలేశ్వరం అయిందని, రేవంత్రెడ్డి ఏ మీటింగులకు వెళ్లినా ఇదే చెబుతూ వస్తున్నాడు. మరి ఇంతలా చెప్పిన ప్రభుత్వం .. కన్నెపల్లి పంప్హౌజ్ను వినియోగించుకుంటుందా? అంటే.. కచ్చితంగా లేదనే సమాధానమే వస్తుంది.
దీని ద్వారా రైతులు నష్టపోయారని బీఆరెస్ చెప్పుకోవాలని చూస్తున్నది. అందుకే కేసీఆర్ సీఎంగా ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా..! అనే ఆలోచన రేకెత్తించడం.. ఇది ఎంతటి ప్రయారిటీ గల విషయమో తెలియజేసేందుకు.. బీఆరెస్ పార్టీని కూడా రద్దు చేస్తామని ప్రకటించడం.. ఇవన్నీ కేసీఆర్ వ్యూహాలుగానే చూడాలి.